ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతోపాటు స్థానిక సమస్యలకు శాశ్వత రూపం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘పట్టణ ప్రగతి’ జూలై 1 నుంచి 10 వరకు గ్రేటర్వ్యాప్తంగా జరగనున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో పెద్దఎత్తున నిర్వహించాలని మంగళవారం జరిగిన బల్దియా నూతన పాలకమండలి సాధారణ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. పట్టణ ప్రగతికి రూ.936 కోట్లు కేటాయించగా, ప్రతి డివిజన్లో కార్పొరేటర్, ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. తొలిసారి వర్చువల్ పద్ధతిన నిర్వహించిన సమావేశంలో ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) వార్షిక బడ్జెట్కు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ పద్దు రూ.6841.87 కోట్లుగా నిర్ధారించారు. దీనిపై పలువురు సభ్యులు లేవనెత్తిన సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. బడ్జెట్ ఆమోదం అనంతరం ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు మేయర్ ప్రకటించారు. బల్దియా కమిషనర్ లోకేశ్కుమార్, ఉన్నతాధికారులు, 156 మంది కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.
సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ ) : మరింత మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 1 (గురువారం) నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించిన దరిమిలా గ్రేటర్లో పది రోజుల పాటు (జులై 10వరకు) పెద్ద ఎత్తున పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని కౌన్సిల్ నిర్ణయించింది. పది రోజుల కార్యక్రమంలో వార్డుల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందుకు రూ. 936 కోట్లు కేటాయించారు. పది రోజుల పాటు జరిగే పట్టణ ప్రగతిలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులకు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం వర్చువల్గా నిర్వహించిన జీహెచ్ఎంసీ బడ్జెట్, జనరల్ బాడీ సమావేశంలో మేయర్ ప్రసంగించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, ఉన్నతాధికారులు, 156 మంది కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ పలు అంశాలపై మాట్లాడారు.
రాష్ట్రంలో గ్రీన్ కవరేజ్ను 33శాతం పెంచాలనే ఆశయంతో ప్రారంభించిన తెలంగాణకు హరిత హారంలో 2016 నుంచి 2020 వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 2.77 కోట్ల మొక్కలను నాటడం, ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని మేయర్ వివరించారు. ప్రస్తుత 2021లో హరితహారంలో భాగంగా కోటిన్నర మొక్కలను నాటాలనే లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్లో జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది అందించిన సేవలను మేయర్ ఈ సందర్భంగా అభినందించారు.