మే 20(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సమయాన్ని జీహెచ్ఎంసీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నది. పనుల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సాధారణ రోజుల్లో పగలు అత్యంత రద్దీగా ఉండే మార్గంలో రోడ్డు వేయాలన్నా.., గుంతలు పూడ్చాలన్నా.. అనేక ఇబ్బందులు తలెత్తేవి. అయితే ఉదయం 6 నుంచి 10 గంటల లాక్డౌన్ సడలింపు సమయం మినహా మిగిలిన 20 గంటల సమయాన్ని వినియోగించుకుంటున్నది. నగర రోడ్లపై సాఫీ ప్రయాణమే లక్ష్యంగా సీఆర్ఎంపీ సుమారు రూ.1839కోట్లతో 709 కిలోమీటర్ల మేర రహదారులను ఆధునీకరించేందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీలకు పనులను అప్పగించారు. ఇందులో భాగంగానే తొలి విడతలో ఏడు ఫ్యాకేజీలుగా విభజించి 331.58 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేయగా, ఈ ఏడాది లక్ష్యంగా 87.7 కిలోమీటర్ల మేర పనులకు శ్రీకారం చుట్టారు. లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ గడిచిన వారం రోజులుగా 10 కిలోమీటర్ల మేర రోడ్డు అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం పను ల్లో వేగం పెరిగిందని, రాబోయే రోజుల్లో నిర్ధేశిత లక్ష్యాన్ని పూర్తి చేస్తామని చెబుతున్నారు.
జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం సహకారంతో ప్రైవేట్ ఏజెన్సీలు పనులు చేపడుతున్నాయి. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, పోలీస్ అధికారులు బృందాలుగా ఏర్పడి పనులు జరుపుతున్నారు. మరమ్మతు పనుల్లో భాగంగా మిషనరీ, మెటీరియల్, ట్యాంకర్లు, మిక్సింగ్ ప్లాంట్ల అనుమతులకు ఎలాంటి అవాంతరాలు రాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రోజూవారీగా కమిషనర్ లోకేశ్కుమార్ రోడ్ల పనుల ప్రగతిని పర్యవేక్షిస్తున్నారు.