మల్కాజిగిరి, డిసెంబర్ 22: బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపిస్తామని గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ సునీతరాము యాదవ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో మల్కాజిగిరి నియోజక వర్గ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సునీతరాము యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఎన్నికల్లో పనిచేయడంతో ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించామన్నారు.
మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్లలో బీఆర్ఎస్ పార్టీ కోట్లాడి అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశామని అన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా కార్పొరేటర్లు, సర్కిల్ అధ్యక్షులతో పాటు వివిధ అనుబంధ సంఘాల సభ్యులు కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే అభర్థి 50వేల మేజారిటీ గెలిపించడంలో ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పామని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీ గెలిపిస్తామన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని, హామీలను అమలు పరిచేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విజయలక్ష్మి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్లు మీనాఉపేందర్ రెడ్డి, శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, నాయకులు ఉపేందర్ రెడ్డి, అనిల్కిశోర్ తదితరులు పాల్గొన్నారు.