Hyderabad Hitech City | కొండాపూర్, మే 16 : హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోనే ఉన్న కాలనీలు, బస్తీలు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాదాపూర్ సర్కిల్ అంజయ్య నగర్ డివిజన్లోని రాజీవ్ వడ్డెర బస్తీ నుంచి ఏఐజీ దవాఖానకు వెళ్ళే దారి మొత్తం చెత్తతో నిండి దుర్వాసనలు వస్తున్నాయంటూ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసిన చెత్త సమస్యను పరిష్కరించడం లేదంటూ అవేదన చెందుతున్నారు. దారి వెంట వెళ్లాలంటేనే భయపడేలా పరిస్థితులున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలనలో ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారని, స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్త సమస్యను పరిష్కరించి, స్థానిక ప్రజలలో బహిరంగ చెత్త పారవేతపై సరైన అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Hitech Cityf