ఇబ్బందులు పడుతున్న స్థానికులు, వాహనదారులు
జవహర్నగర్, ఏప్రిల్ 1: ప్రభుత్వం చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయరాదని ఎన్నిసార్లు చెప్పినా తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇంటింటికీ రెండు చెత్త బుట్టలు ఇచ్చి తడి, పొడి చెత్త వేర్వేరుగా స్వచ్ఛ వాహనాలకు అందించాలని అవగాహన కల్పిస్తున్నా కొంత మంది బాధ్యతారాహిత్యంగా ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. జవహర్నగర్ కార్పొరేషన్లోని వికలాంగుల కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై నిత్యం వేలాది వాహనదారులు ప్రయాణం చేస్తుంటారు. స్థానికులు కొంత మంది తడి, పొడి చెత్తను తీసుకువచ్చి, రోడ్డుపై పడేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. చెత్తను మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు తీయకపోవడంతో కుక్కలు, పందులు చెత్తలో ఆహారం వెతుకుతూ చిందరవందర చేస్తున్నాయి. దీంతోపాటు రోడ్డుపై వెళ్లే వాహనదారులకు కుక్కలు, పందులు అడ్డుగా రావడంతో కిందపడి గాయాలైన సంఘటనలు ఉన్నాయి. చెత్త పేరుకుపోయి ముక్కుఫుటాలు అదిరిపడే దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, మళ్లీ ఇక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను కోరుతున్నారు.
వెంటనే చర్యలు తీసుకుంటాం ..
బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయరాదని ప్రజలకు అవగాహన కల్పించాం. తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ వాహనాలకు అందించాలని చైతన్యపరుస్తున్నాం. కార్పొరేషన్లోని వికలాంగుల కాలనీకి వెళ్లే దారిలో చెత్తను డబ్బాలో కాకుండా రోడ్డుపైనే వేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది.వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. చెత్తను బహిరంగ ప్రదేశంలో వేసే వారికి జరిమానా విధిస్తాం.
–జ్యోతిరెడ్డి, కమిషనర్, జవహర్నగర్ కార్పొరేషన్