Hyderabad | రద్దీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మగవారి మెడలో గొలుసు కనిపిస్తే చాలు.. చుట్టుముడుతారు.. పంటితో తెంపేస్తారు. మహిళల జోలికి వెళ్లకుండా.. నడివయస్సు పైబడిన పురుషులనే లక్ష్యంగా చేసుకుంటారు. మెడలో బంగారం నగలు ఉన్న వారిని బోలాతో పాటు ముఠా సభ్యులు చుట్టుముట్టి బాధితుడిని మైకంలోకి దింపుతారు. బోలా బాధితుడి మెడపై వాలినట్లు నటిస్తూ.. బంగారు గొలుసును పంటితో తెంపేస్తాడు. చైన్ కిందపడగానే బాధితుడు తేరుకునే లోపే చైన్ తీసుకొని ఒక్కొక్కరుగా అక్కడి నుంచి జారుకుంటారు. ఇటీవల ఇలాంటి చోరీలు అధికమవ్వడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పిక్పాకెటర్స్ గ్యాంగ్లకు కేరాఫ్గా మారిన మంగార్ బస్తీ ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. సినిమా థియేటర్ల నుంచి ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న మంగార్ బస్తీకి చెందిన మక్కన్ ముఠా గుట్టును రట్టుచేశారు.
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రయాణికుల దృష్టి మళ్లించి పిక్పాకెటింగ్లకు పాల్పడుతున్న మంగార్ బస్తీకి చెందిన ముఠా నాయకుడు, దొంగ బంగారాన్ని రీసివ్ చేసుకుంటున్న మరో వ్యాపారిని ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్, అఫ్జల్గంజ్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. వీళ్ల వద్ద నుంచి రూ.18.5 లక్షల విలువైన 34.3 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చిన్న దొంగలు.. పెద్ద దోపిడీలకు సంబంధించిన వివరాలను మంగళవారం బషీర్బాగ్లోని పాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈస్ట్జోన్ డీసీపీ సునీల్దత్, టాస్క్ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు.
మల్లెపల్లి, మంగార్ బస్తీకి చెందిన కేఎస్.మక్కన్ 2017 వరకు 17 కేసులలో నిందితుడు. జైల్లో పలువురితో పరిచయాలు పెంచుకున్నాడు. బయటకు వచ్చిన తరువాత పాత నేరస్థులతో మంగార్ బస్తీ, అఫ్జల్సాగర్, మల్లెపల్లికి చెందిన బోలా, మన్నన్, సిఖిందర్, హీర, బక్రీ సికిందర్, ఖదీర్లతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. మొదట సినిమా థియేటర్ల టిక్కెట్ల కౌంటర్ల వద్ద రద్దీగా ఉన్న ప్రాంతాలలో జేబు దొంగతనాలు, సెల్ఫోన్లు అపహరించేవారు. అలా చిన్న చిన్న చోరీలతో మొదలై సంపాదన సరిపోకపోవడంతో తమ రూట్ను మార్చారు. ఆర్టీసీ బస్సులలో ఎక్కి ప్రయాణికుల గొలుసులు, పర్సులు కొట్టేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. దీనికి మహత్మాగాంధీ బస్స్టాండ్, అఫ్జల్గంజ్ తదితర ప్రాంతాల నుంచి కూకట్పల్లి, సికింద్రాబాద్ వెళ్లే బస్సులను టార్గెట్ చేస్తారు. అపహరించిన గొలుసు, సెల్ఫోన్లను గ్యాంగ్ లీడర్ మక్కన్కు అందజేస్తారు. అతడు శాలిబండలోని ప్రవీన్ రమేశ్ వర్మ అనే వ్యాపారికి తక్కువ ధరకు విక్రయిస్తాడు. విశ్వసనీయ సమాచారంతో గ్యాంగ్ లీడర్, దొంగ బంగారాన్ని కొంటుకున్న ప్రవీణ్ను అరెస్ట్ చేయగా మిగతా వారు పరారీలో ఉన్నారు.
ఆర్టీసీ బస్సులు, కూరగాయాల మార్కెట్లు, ఇతరాత్ర రద్దీగా ఉండే ప్రాంతాలలో తిరిగే సమయంలో తమ సెల్ఫోన్లను ముందు జేబులో పెట్టుకోవద్దని డీసీపీ చక్రవర్తి గుమ్మి సూచించారు. జాగ్రత్తగా ప్యాంట్ ముందు జేబులో సెల్ఫోన్, పర్సు పెట్టుకోవడం మంచిందన్నారు. బస్సులో ప్రయాణించే వారు తమ చుట్టు పక్కల ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఇతరులను అప్రమత్తం చేయాలని, లేదంటే డయల్ 100కు ఫోన్ చేయాలని డీసీపీ సూచించారు.
మంగార్ బస్తీ గతంలో పిక్పాకెటర్స్ అడ్డాగా ఉండేది. ఇటీవల నేరస్థులు ప్రవర్తన మార్చుకొని వివిధ పనులకు వెళ్తున్నారు. అయితే కొందరు మాత్రం పిక్పాకెటింగ్లు చేయడాన్నే వృత్తిగా పెట్టుకున్నారు. అలాంటి వాళ్లలో ఒకరు కేఎస్.మక్కన్. ఇతడి వద్ద పనిచేసేందుకు ఒక బోలాతో పాటు చాకులాంటి వాళ్లను నియమించుకుంటాడు. ఈ ముఠా సభ్యులు రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సులలో సాధారణ ప్రయాణికుల మాదిరిగానే ఎక్కేస్తారు. మెడలో బంగారు ఆభరణాలు ఉన్న వారిని ఎంచుకొని చుట్టుముడుతారు. అలా చుట్టిముట్టిన వ్యక్తికి దగ్గరగా వెళ్లి బోలా నిలబడడంతో పక్కన ఉన్నవారు, అతన్ని నెట్టేస్తుంటారు. అలా నెట్టడంతో బోలా వెళ్లి లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తికి తగులుతూ.. అదను చూసి ఒక్కసారిగా అతని మెడపై ఒంగిపోయినట్లు చేసి క్షణాల్లో మెడలో ఉండే బంగారు గొలుసును పంటితో కొరికేస్తాడు. గొలుసు కింద పడగానే బోలా పక్కన ఉన్న వాళ్లు తీసుకొని అక్కడి నుంచి తప్పుకుంటారు. ఒక్కొక్కరు మెల్లగా అక్కడి నుంచి పక్కకు జరుగుతూ తరువాత బస్స్టాప్లో దిగేసి, బస్సును వెంబడించే వారి ఆటోలో ఎక్కి పారిపోతారు. ఇదిలా ఉండగా గ్యాంగ్ లీడర్ మక్కన్ తన ముఠా సభ్యులందరికి రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు జీతాలిస్తాడు. బోలాకు మాత్రం ఎక్కువ మొత్తంలో చెల్లిస్తుంటాడు.