సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రజల సహకారంతో గణేశ్ నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం నెక్లెస్ రోటరీ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు నిమజ్జన కార్యక్రమం కొనసాగిందన్నారు. దీంతో 48 గంటల పాటు పోలీస్ సిబ్బంది బందోబస్తులో ఉన్నారని, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 15 శాతం వరకు విగ్రహాలు పెరిగాయన్నారు. 60 వేల వరకు విగ్రహాలు నిమజ్జనమయ్యాయని, అందులో జియోట్యాగింగ్ అయిన మూడు అడుగుల కంటే ఎక్కువగా ఎత్తున్న 10,200 వరకు విగ్రహాలు ఉన్నాయన్నారు. ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని ఉదయం 6.30 గంటలకు ప్రారంభించి, మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు పూర్తి చేయడం చరిత్రలో మొదటి సారి అని ఆయన వెల్లడించారు. సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు. గురువారం హెలికాప్టర్పై మంత్రులతో పాటు నిర్వహించిన ఏరియల్ సర్వే సమయంలో విగ్రహాలు రోడ్లపై పలుచగా కనిపించాయన్నారు. వెంటనే విషయాన్ని ఆయా డీసీపీలకు సూచించామన్నారు. పోలీసు అధికారులు మండపాల నిర్వాహకులతో మాట్లాడి..
విగ్రహాలను వేగంగా నిమజ్జనానికి తరలించే విధంగా సూచనలు చేశారన్నారు. ఈసారి ఆలస్యంగా విగ్రహాలు నిమజ్జనానికి తరలిరావడంతో శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగిందన్నారు. శుక్రవారం సాధారణ ట్రాఫిక్కు ఇబ్బందులు రాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. నిమజ్జనానికి విగ్రహాలతో తరలివచ్చిన వాహనాలను ఒక పక్కకు పంపించి.. ఇతర వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా సంజీవయ్య పార్కు వద్ద, బషీర్బాగ్లో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, ఇటీవల జరిగిన ఇలాంటి ప్రమాదాలలో ఐదుగురు మృతి చెందారన్నారు. నిమజ్జన కార్యక్రమాలు వీక్షించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారని, షీ టీమ్స్ నిఘా పెట్టి 255 మంది పోకిరీలపై కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ సారి గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఒకే రోజు వచ్చాయని, అందుకు పోలీసులు సిద్ధమయ్యారని, ముస్లిం మత పెద్దలు తమ ర్యాలీని అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసుకొని గొప్పనిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ సారి గణేశ్ నవరాత్రి వేడుకలు గొప్పగా జరిగాయన్నారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.