బంజారాహిల్స్,సెప్టెంబర్ 29: ఖైరతాబాద్ నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనాలు శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్ నగర్ డివిజన్లలో గురువారం సాయంత్రం కొన్ని విగ్రహాలను నిమజ్జనాలకు తరలించినా ఎక్కువశాతం విగ్రహాలు అర్థరాత్రి దాటిన తర్వాతనే ఆయా బస్తీలనుంచి బయలుదేరాయి. ఫిలింనగర్ 18 బస్తీలు, బంజారాహిల్స్ రోడ్డు నంబర్14లోని నందినగర్, వెంకటేశ్వరనగర్ తదితర బస్తీల్లో ఏర్పాటు చేసిన విగ్రహాల ఊరేగింపు ఉత్సాహంగా కొనసాగింది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎన్బీటీనగర్, ఎన్బీనగర్ ప్రాంతాల్లో శోభాయాత్రలు నెమ్మదిగా కొనసాగాయి. పోలీసులు ఆయా ఊరేగింపులను వడివడిగా ముందుకు సాగేలా ప్రయత్నాలు చేసినా సుమారు 60 శాతం విగ్రహాల ఊరేగింపులు శుక్రవారం తెల్లవారుజామున 4గంటల దాకా కొనసాగాయి. మొత్తం మీద నియోజకవర్గంలో నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా పూర్తి కావడంతో పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వశాఖల అధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు.