ఖైరతాబాద్, సెప్టెంబర్ 19 : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవాన్ని దర్శించుకునేందుకు లక్షలాదిగా ప్రజలు బారులు తీరారు. లుంబినీ పార్కు నుంచి పీవీ నరసింహా రావు మార్గ్లోని ఆయన విగ్రహం వరకు సుమారు లక్షన్నర మంది నిమజ్జనానికి హాజరైనట్లు చెబుతున్నారు. ఇసుక వేస్తే రాలనంత జనంతో ఎన్టీఆర్ మార్గ్ నిండిపోయింది. ప్రజల కోసం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హెల్ప్ డెస్క్, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. బల్దియా ఆధ్వర్యంలో లక్ష మాస్కులు సిద్ధంగా ఉంచగా, మాస్కులు ధరించకుండా వచ్చిన వారికి సిబ్బంది వాటిని అందజేశారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష వాటర్ ప్యాకెట్లతో దాహార్తి తీర్చారు. ఇదిలా ఉంటే గణపతి నిమజ్జనాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరాగా, చిన్నారులు తప్పిపోయారు. దీంతో వారిని పోలీసు, జీహెచ్ఎంసీ సిబ్బంది కమాండ్ కంట్రోల్ రూమ్ వద్దకు చేర్చారు. అనౌన్స్మెంట్ ద్వారా వారి కుటుంబసభ్యులను అక్కడికి రప్పించి పిల్లలను సురక్షితంగా అప్పగించారు.