సిటీబ్యూరో, సెప్టెంబరు 17 (నమస్తే తెలంగాణ ) : గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. శుక్రవారం ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్లో నిమజ్జన ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, కలెక్టర్ శర్మన్, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సత్యనారాయణ, హెచ్ఎండీఏ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఆర్టీఏ తదితర శాఖల అధికారులతో కలిసి మంత్రి తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో అధికారులతో ఏర్పాట్లపై మంత్రి తలసాని, మేయర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మన్సూరాబాద్ డివిజన్ పరిధి సరస్వతీనగర్ కాలనీ సమీపంలోని పెద్దచెరువును మేయర్ పరిశీలించారు.
ఆదివారం జరుగనున్న గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని పేరొన్నారు. హైదరాబాద్లో నిర్వహించే గణేశ్ శోభాయాత్రకు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 320 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరుగుతుందని, ఆయా రహదారులలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి సుమారు 19వేల మంది వివిధ స్థాయిల్లోని పోలీసు సిబ్బంది విధులలో పాల్గొంటారని, ప్రతి క్రేన్ వద్ద, ప్రతి విగ్రహం వెంట ఒక పోలీసు అధికారిని నియమిస్తామని చెప్పారు. వాహనదారులు, భక్తులకు ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఆర్ అండ్ బీ అధికారుల సమన్వయంతో ట్రాఫిక్ డైవర్షన్కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసే క్రేన్ నెంబర్ 6 వద్ద హుస్సేన్సాగర్లో పూడికతీత పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. విగ్రహాల నిమజ్జనానికి ఆర్టీఏ ఆధ్వర్యంలో వెయ్యి వాహనాలను అందుబాటులో ఉంచామని, అవసరమైనవారు వినియోగించుకోవాలన్నారు. వాహనాల పర్యవేక్షణకు 10 మంది ఆర్టీఏ అధికారులు, 50 మంది మోటార్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను నియమించినట్లు మంత్రి చెప్పారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 19న గ్రేటర్లో జరుగనున్న గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ పరిధిలో 565 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని దాదాపు 31 డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు, ప్రతి డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రకటించారు. గణేశ్ నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 19న అర్ధరాత్రి తర్వాత కూడా ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు. ఆర్టీసీలో ప్రయాణం చేసే భక్తులకు ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే రెతిఫైల్ బస్ స్టేషన్లో 9959226154, కోఠి బస్ స్టేషన్లో 9959226160 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ట్రాఫిక్ క్లియరెన్స్కు ఇద్దరు అధికారులను నియమించనున్నారు. జాయింట్ కంట్రోల్ రూమ్ వద్ద మరో ఎనిమిది మంది అధికారులను ఏర్పాటు చేశామన్నారు. రిలీవ్ వ్యాన్లు మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ)/బడంగ్పేట : నగరంలో ఆదివారం జరిగే గణేశ్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లు, సంబంధిత రూట్లను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకు ప్రధాన నిమజ్జనోత్సవ ర్యాలీ జరుగుతున్న నేపథ్యంలో ఆ రూట్లో సీపీ బృందం పర్యటించింది. అనంతరం ట్యాంక్బండ్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీపీ నిమజ్జన ర్యాలీ జరిగే రూట్లో సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. బందోబస్తు ఎలా చేస్తున్నారనే విషయంపై స్థానిక డీసీపీలను అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట అదనపు సీపీలు శిఖా గోయెల్, డీఎస్ చౌహాన్, ఐజీ విజయ్కుమార్, జాయింట్ సీపీలు ఏఆర్ శ్రీనివాస్, విశ్వప్రసాద్, ఎం.రమేశ్, డీసీపీలు కల్మేశ్వర్, గజారావు భూపాల్, ట్రాఫిక్ డీసీపీ చౌహాన్, టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు తదితరులు ఉన్నారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా విగ్రహ ప్రతిమలను నీటిలో వేసినప్పుడు కలుషితం కాకుండా జీహెచ్ఎంసీ పటిష్టచర్యలు చేపట్టినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. చెరువులో వేసిన వెంటనే ప్రతిమలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులకు అవసరమైన తాగునీరు, టాయిలెట్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించామని మేయర్ తెలిపారు.