నారీకేళములన్నీ గణపతి రూపమిచ్చి
విఘ్నాలు తొలగించి వరాలిచ్చే వినాయకుడు విభిన్న రూపాల్లో భక్తులను కనువిందు చేస్తున్నాడు. డ్రైఫ్రూట్స్, టీకప్పులు, సాబుదాను, మొక్కజొన్న కంకులు, ప్రమిదలు, చిరుధాన్యాలతో లంబోదరులను సుందరంగా ముస్తాబు చేయగా, నగరవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు సంబురంగా జరుగుతున్నాయి. గాంధీనగర్లో 36 అడుగుల ఎత్తులో..17 వేల టెంకాయలతో అలరిస్తున్న విఘ్నేశ్వరుడు
ఖైరతాబాద్, సెప్టెంబర్ 1 : వినాయకచవితి పర్వదినాన ఖైరతాబాద్లో కొలువుదీరిన పంచముఖ మహాలక్ష్మి గణపతి ప్రతిష్ఠాపన మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. తొలి పూజకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ తదితరులు హాజరయ్యారు. అంతకుముందు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో 60 అడుగుల భారీ కండువా, జంజం, గరికమాలను రాజ్దూత్ చౌరస్తా వద్ద నుంచి గుర్రపు బగ్గీలో కోలాటం, డప్పు చప్పుళ్లు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగిస్తూ ఉదయం 9గంటల వరకు ఖైరతాబాద్ గణేశ్ మండపానికి చేరుకున్నారు.
ఖైరతాబాద్ మట్టి గణపతిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
60 అడుగుల జంజంను హైకోర్టు అడ్వకేట్ జనరల్ బండా శివనంద ప్రసాద్, చేనేత నూలు కండువాను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, గరికమాలను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. మనోహర్ సమర్పించారు. అలాగే లక్ష్మి అమ్మవారికి పట్టువస్ర్తాలను హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యస్వామికి జంజం, కండువాలను గాంధీ దవాఖాన డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహారావు నేత, త్రిశక్తి మహాగాయత్రి దేవి అమ్మవారికి పట్టు వస్ర్తాలను పద్మశాలి సంఘం అధ్యక్షులు కడారి శ్రీధర్ సమర్పించారు. స్వామి వారికి పూలు, ముత్యాలభిషేకం నిర్వహించారు. ఖైరతాబాద్ మహాగణపతిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, డీజీపీ మహేందర్రెడ్డితో పాటు పార్లమెంటరీ బోర్డు సభ్యులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి రోజు రాత్రి 12గంటల వరకు స్వామి వారిని సుమారు నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకొని ఉంటారని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
ఖైరతాబాద్ గణేశ్ తొలిపూజలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ తదితరులు
మహాగణపతిని దర్శించుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ సీవీ ఆనంద్
బాలాపూర్ గణేశ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నింబోలి అడ్డాలో సత్యనారాయణస్వామి రూపంలో కొలువుదీరిన గణనాథుడు
సికింద్రాబాద్ సిటీ లైట్ రోడ్లో సాబుదాన, సోయాబీన్, బబ్బెర్లతో తయారు చేసిన గణపతి
21 కేజీల లడ్డూ
పంచముఖ మహాలక్ష్మి గణపతికి ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు, శివలాల్ యాదవ్ చారిటుబల్ ట్రస్ట్ చైర్మన్ ఎం.మహేశ్ యాదవ్, సుజాత దంపతులు 21 కేజీల లడ్డూను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్, కార్యనిర్వహక కార్యదర్శి సింగరి రాజ్ కుమార్, తేజ, సాయిసుప్రిత్ తదితరులు పాల్గొన్నారు.