గాంధీ, ఉస్మానియాలో ఉచితంగా మోకాలి చిప్పల మార్పిడి
సిటీబ్యూరో, మార్చి 31 : తెలంగాణ సర్కార్ దవాఖానల్లో పైసా ఖర్చు లేకుండా నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందిస్తున్నది. ఇందులో భాగంగా మోకాలి చిప్పల మార్పి డి శస్త్ర చికిత్సలనూ ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో 30-40 ఏండ్లలోనే చాలా మందికి మోకాలి నొప్పులు వస్తున్నాయి. వీరిలో ఎక్కువగా వయస్సు పైబడిన వారిలో మోకాలి చిప్పలు అరిగిపోతున్నాయి. దీంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. కూర్చుంటే లేవలేని దుస్థితి. ప్రైవేటు దవాఖానల్లో మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్సకు రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలు ఖర్చవుతుంది. రెండు మోకాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకోవాలంటే రూ.8 లక్షలు కావాలి. అంతఖర్చు భరించలేని నిరుపేదలకు ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగానే మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు.
గతంలో సీఎం రిలీఫ్ ఫండ్తోనే….
గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు జరిగేవి. శస్త్ర చికిత్సలు ఉచితంగా నిర్వహించినప్పటికీ ఇంప్లాంట్స్ మాత్రం బయట నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఒక్కో ఇంప్లాంట్ సుమారు రూ. లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్భారత్ కింద మోకాలి చిప్ప ఇంప్లాంట్స్ను పూర్తి ఉచితంగా ప్రభుత్వమే సమకూరుస్తుంది.
కార్పొరేట్కు దీటుగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిరుపేదలకు గాంధీ, ఉస్మానియా వంటి దవాఖానల్లో ఉచితంగా మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకోవచ్చు. కరోనా కారణంగా ఇటీవల శస్త్రచికిత్సలు జరగలేదు. గత నెల నుంచి వీటిని పున:ప్రారంభించాం. ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్భారత్ కింద ఈ శస్త్రచికిత్సలను పూర్తి ఉచితంగా జరుపుతున్నాం. గాంధీలో ప్రస్తుతం ఆర్థో విభాగానికి సంబంధించి 4ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఇక్కడ ముగ్గురు అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వీరితో పాటు పీజీలు, రెసిడెన్సీ వైద్యులు కూడా నిరంతరం కృషి చేస్తున్నారు.
– డా.రవీందర్కుమార్, ఆర్థోపెడిక్ విభాగాధిపతి