Gandhi Hospital | బన్సీలాల్పేట్, ఆగస్టు 21 : ప్రభుత్వ దవాఖానల విభాగంలో మొట్టమొదటిసారిగా గాంధీ దవాఖానకు రెండు ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) ద్వారా రెండు విభాగాల్లో ప్రశంసాపూర్వక సర్టిఫికెట్లను అందుకున్నామని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తెలిపారు. ఈ సందర్భంగా ఎం.రాజారావు మాట్లాడుతూ… టెరిటరి లెవెల్ పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ విభాగంలో క్వాలిటీ మేనెజ్మెంట్ సిస్టమ్ (ఐఎస్ఓ 9001:2015), ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ విభాగంలో (ఐఎస్ఓ 45001:2018) క్వాలిటీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ ఈ రెండు సర్టిఫికెట్లను అందజేసిందని, వాటి కాలపరిమితి 2026 వరకు ఉంటుందన్నారు.
కంప్యూటరైజ్డ్ విధానంలో దవాఖానలో జరిగే రోజువారి కార్యకలాపాల్లో ప్రధానంగా రక్తదాన కేంద్రంలో ఈ-రక్తకోశ్, మందులను కొనుగోలు చేయడానికి ఈ-ఔషధి, సామగ్రి కొనుగోలు కోసం ఈ-ఉపకరణ్, బయటిరోగుల నమోదు వివరాలను సి-డాక్ లాంటి వెబ్సైట్లలో సమాచారం పొందుపరుస్తున్నామని తెలిపారు. హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ గైడ్లైన్స్ రూపొందించి, అమలు చేయడం తదితర విషయాలను తెలుసుకున్న క్వాలిటీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ గాంధీ దవాఖానను పరిశీలించి, సర్టిఫికెట్లను అందజేసిందన్నారు. ఆదివారం మాతా, శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు, ఈ ఘనత సాధించడంపై గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావును, గైనకాలజీ విభాగం హెచ్ఓడీ ప్రొఫెసర్ సంగీత, ఇతర సిబ్బందిని అభినందించారు.