ఖైరతాబాద్, జూలై 7 : ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు జరిగిన అన్యాయానికి నిరసనగా మరో పోరాటానికి సిద్ధం కావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు సూచనలు పాటించకుండా సరైన ఎంపరికల్ డేటా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ వల్ల మాలలు విద్య ఉద్యోగ రంగాలలో తీవ్రంగా నష్టపోతున్నారని, గ్రూప్-3 లో మాలలతో పాటు మరో 25 కులాలకు అన్యాయం జరిగిందన్నారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లలో ఒక్క ఉద్యోగం కూడా గ్రూప్ -3 కి కేటాయించబడలేదంటే మాలలపై ప్రభుత్వం ఏ స్థాయిలో కుట్ర చేసిందో అర్థమవుతుందని, ఈ వర్గీకరణ పై న్యాయపోరాటం చేస్తూనే ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామన్నారు.
మాలలకు జరిగిన అన్యాయంపై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకే ఈ నెల 11న లకిడికాపూల్ లోనీ వాసవి క్లబ్ లో మాల మహానాడు రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బైండ్ల శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగి ఆనందరావు, నల్లగొండ జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే లలిత, మరిపల్లి శ్రీకాంత్, రాజేష్ రాకేష్,శివశంకర్,బాలకృష్ణ, శాలిం రాజు, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.