ధాన్యం కొనుగోళ్లకు 11 కేంద్రాలు
ధాన్యానికి కనీస మద్దతు ధర రూ. 1,960
సమీక్షా సమావేశంలో మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్, ఏప్రిల్13 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు ఆదేశించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో బుధవారం కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన మంత్రి మల్లారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో రైతులకు నష్టం వాటిల్లకూడదనే యాసంగిలో వడ్లను కొనుగోలు చేసేందుకు నిర్ణయించారని చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ధాన్యానికి కనీస మద్దతు ధరను రూ. 1,960 ప్రభుత్వం నిర్ణయించిందని, ధాన్యం కొనుగోలు చేసిన 72గంటల్లో రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు. జిల్లా జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు నిర్ణయంపై రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నదని చెప్పారు.
జిల్లాలో 11 కొనుగోలు కేంద్రాలు..
వడ్ల దిగుబడుల అంచనాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7,800 ఎకరాలలో వరి సాగు చేసారని, సుమారు 18 వేల మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తాయని వ్యవసాయాధికారులు అంచనా వేసినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించడంతో పాటు, ధాన్యం వచ్చిన వెంటనే తూకం వేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జడ్పీ వైస్చైర్మన్ వెంకటేశ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మేరి రేఖ, డీఎస్వో పద్మావతి, జిల్లా రైస్ మిల్లర్ల అసోషియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ధాన్యం కొనుగోలు విషయమై బుధవారం ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలలో వడ్లు కొనుగోలుపై జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.