మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న చెరువుల సుందరీకరణకు తగిన నిధులు మంజూరు చేయాలని, చెరువులను రక్షించుకోవటంతోపాటు వాటిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటును అందించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమేయ్కుమార్ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కోరారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం విచ్చేసిన కలెక్టర్ను విప్ మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ చెరువులు కబ్జాకు గురి కాకుండా కాపాడాలని , ఎఫ్టీఎల్ , బఫర్ జోన్లను నిర్దేశిస్తూ రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో చెరువులను సుందరీకరించుకునేందుకు ప్రభుత్వ నిధులు లేని పక్షంలో సీఎస్ఆర్ నిధులను మంజూరు చేయాలని కలెక్టర్ను విప్ కోరారు.
నియోజకవర్గవ్యాప్తంగా చెరువుల్లోకి మురుగు నీరు పోకుండా 7 ఎస్టీపీలను మంజూరు చేసినందుకు మంత్రి కేటీఆర్కు విప్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. ఎస్టీపీల నిర్మాణానికి తగిన స్థలాలను కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ను కోరారు. కాగా తన విన్నపం పట్ల కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జోనల్ కమీషనర్ నాగళ్ల రవికిరణ్ పాల్గొన్నారు.