ఎల్బీనగర్, ఆగస్టు 30 : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు పది లక్షల మంది దివ్యాంగులకు పూర్తి స్థాయిలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించి ప్రతి దివ్యాంగునికి వ్యాక్సిన్ ఇస్తామని సమదృష్టి క్షమత వికాసం ఏవం అనుసంధాన్ మండలి(స క్ష మ్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేదప్రకాశ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం దిల్సుఖ్నగర్ చైతన్యపురిలోని చైతన్య డిగ్రి కళాశాల అడిటోరియంలో వివిధ దివ్యాంగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి వేదప్రకాశ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. రాష్ట్రంలో పది లక్షలకు పైగా దివ్యాంగులు ఉన్నారని, వారిలో చాల మంది వివిధ కారణాలతో కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకోలేదని పేర్కొన్నారు.
వ్యాక్సిన్లు తీసుకోని దివ్యాంగులను గుర్తించి మొదటి దశలో ఇరవై వేల మంది దివ్యాంగులకు సాధ్యమైన తొందరగా ఉచితంగా వ్యాక్సిన్లు వేస్తామని అన్నారు. దివ్యాంగులు ఎలాంటి అపొహలకు గురిగాకుండ వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. దివ్యాంగుల వ్యాక్సినేషన్ కార్యక్రమానికి దివ్యాంగులతో పాటు సకలాంగులు కూడా ముందుకొచ్చి సక్షమ్ సంస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబరు నెలలో కార్యక్రమాన్ని ప్రారంబిస్తామని వివరించారు.
కార్యక్రమంలో సక్షమ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కరుణకర్, ప్రతినిధి అర్జున్రామ్, ఎన్పీడీఓ అధ్యక్షుడు ఎం శ్రీనివాసులు, జాతీయ దివ్యాంగుల ఐక్యవేదిక అధ్యక్షులు భాణురాథోడ్, ఉదయ్ తెలంగాణ జాతీయ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి పి.సుధాకర్వర్మ, పద్మావతి ఇన్స్టిట్యూట్ అధ్యక్షురాలు పద్మప్రియ, వేవ్ మీడియా ఏడిటర్ వసుందర, పిన్ సంస్థ నిర్వాహకులు బాలకృష్ణారెడ్డి, దివ్యాంగుల హక్కుల సాధన సమితి అధ్యక్షులు గుత్తికొండ కిరణ్, తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల పరిశోధక సంఘం అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి పి.నాగరాజు, దివ్యాంగుల ప్రతినిధులు మల్లిఖార్జున్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.