సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : నగరం.. దేశంలోనే విద్యాహబ్గా ఎదిగింది. గ్రేటర్ హైదరాబాద్ విద్యాపరంగా రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాల వల్ల అనేక పరిశ్రమలు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ సంస్థలు రంగ ప్రవేశం చేస్తున్నాయి. ఫార్మాసిటీ అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమంలో నగరంలో ఉన్న డిగ్రీ కాలేజీలకు ఫుల్ క్రేజ్ వస్తున్నది. నగరంలో దాదాపు 300 పైగా ఉన్న డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత డిగ్రీ కాలేజీలలో ప్రవేశాలు పొందిన్లయితే.. ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడడంతో పాటు పోస్టు గ్రాడ్యుయేషన్లు, పీహెచ్డీలు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. పైగా మార్కెట్ పోకడలకు అనుగుణంగా డిగ్రీ కోర్సులలో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకువస్తూ పలు యూనివర్సిటీలు నిర్ణయం తీసుకుంటున్నాయి. బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి రెగ్యులర్ కోర్సులతో పాటు బీబీఏ, డిగ్రీ ఆనర్స్ వంటి పలు రకాల కాంబినేషన్లతో నూతన కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం డిగ్రీ ఆన్లైన్ సిస్టం ఆఫ్ తెలంగాణ (దోస్త్) 2023 ద్వారా జరిగిన అడ్మిషన్ల విధానాన్ని పరిశీలించినట్లయితే నగరంలోని డిగ్రీ కాలేజీలకు విద్యార్థులు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా సమాచారం ఉంది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి మూడు జిల్లాలకు చెందిన డిగ్రీ కాలేజీలలో అడ్మిషన్లు నిండుతున్నాయి. పలు డిగ్రీ కాలేజీలలో బీఏ, బీకామ్, బీఎస్సీతో పాటు బీబీఏ కోర్సులలో కూడా సీట్లు పూర్తిగా భర్తీ అవుతున్నాయి. డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ వంటి కోర్సులు అందించే కాలేజీలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు నగరంలో డిగ్రీ కాలేజీలలో ప్రవేశాలు పొందడానికి అనేక కారణాలు ఉన్నాయి. డిగ్రీ కాలేజీలలో విద్యానభ్యసిస్తూనే.. మరో పక్క సివిల్ సర్వీసెస్, గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ, పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటారు. ఈ మేరకు దీర్థకాలిక కోచింగ్లు పొందుతున్నారు. దీంతో డిగ్రీ పూర్తవగానే ఉద్యోగ రాత పరీక్షలకు హాజరవుతున్నారు. అలాగే హైదరాబాద్ మహానగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాలకు చెందిన డిగ్రీ విద్యార్థులు చదువుతో పాటు పార్ట్టైమ్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది స్విగ్గీ, జొమాటో, రాపిడో వంటి ఉద్యోగాలు చేస్తున్నారు. కొనసాగింపుగా హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్మాళ్లు వంటి ఉద్యోగాలు చేసుకోవడానికి నగరం కేంద్రంగా మారింది. దీంతో నగరంలో ఉన్న డిగ్రీ కాలేజీలకు ఫుల్ క్రేజీ ఉన్నట్లుగా ఉన్నత విద్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు కూడా మంచి లాభసాటిగాను ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల నుంచి ఆదరణ పెరుగుతుందన్నారు. దోస్త్ ఆన్లైన్ సర్వీసు ద్వారా వేల సంఖ్యలో విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నట్లు కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. పైగా బాలురతో పాటు బాలికలకు కూడా హైదరాబాద్ ఆహ్వానం పలుకుతుంది. విద్యార్థినులు రియల్ఎస్టేట్, షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లు, హాస్పిటళ్లు, మొబైల్ నెట్వర్క్ వంటి వాటిలో పార్ట్టైమ్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే హైదరాబాద్లో ఉన్న డిగ్రీ కాలేజీలకు మంచి ఆదరణ వస్తుంది.
ఇంజినీరింగ్లో ఉన్న కోర్సులను క్రమంగా డిగ్రీ స్థాయిలో కూడా ప్రవేశపెడుతున్నారు. అయితే అందులో ఉండే సిలబస్తో కంటే ఇక్కడ కొంత వరకు సిలబస్ తక్కువగా ఉన్నప్పటికీ డిగ్రీ విద్యార్థులు రెగ్యులర్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీతో పాటు అదనంగా కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులను కూడా నేర్చుకునే పరిస్థితులు వచ్చాయి. కంప్యూటర్ పరిజ్ఞానం కోసం బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్.. ఇలా బీఎస్సీతో అనేక కోర్సులు వస్తున్నాయి. వీటిని ఎంఎస్సీలో కూడా పొడిగించనున్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్లో ఎలాంటి కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయో.. వాటన్నింటికి క్రమంగా రెగ్యులర్ డిగ్రీలో కూడా ప్రవేశ పెట్టబోతున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతుంది. ఇదిలా ఉంటే బీకామ్ కోర్సు ఉన్న డిమాండ్ కూడా ఇంతా అంతా కాదు. బీకామ్ చేస్తే ఉద్యోగం గ్యారంటీ అన్న ముద్ర పడింది. బీకామ్తో పాటు కంప్యూటర్ కోర్సు చేస్తున్నారు. బీకామ్ తర్వాత సీఏ వంటి కోర్సులు పూర్తి చేసిన ఉన్నత స్థానాలకు వెళుతున్నారు. ఈ విధంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్ రంగంలో బీకామ్ పూర్తి చేసిన యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులో ఉంటున్నాయి. బీఏలో కంప్యూటర్ కోర్సులు కూడా క్రమంగా ప్రవేశ పెడుతున్నారు. ఇప్పటికే యూజీసీ నిర్ణయం ప్రకారం చాయిస్ బేస్ట్ క్రెడిట్ సిస్టం, బక్కెట్ సిస్టమ్ అంటే డిగ్రీలో విద్యార్థులు తమకు ఇష్టం వచ్చిన కోర్సులను ఎంపిక చేసుకునే వెసులుబాటును కల్పించినట్లు.. దీని వల్ల కూడా ఇంజినీరింగ్ కోర్సుల కంటే డిగ్రీలు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నది.