దుండిగల్, జూన్16: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు హాజరైన అనంతరం ఓ యువతిపై ఆమె ఇంట్లోనే లైంగికదాడి జరిగింది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. గుజరాత్కు చెందిన యువతి(28) ప్రగతినగర్లోని గ్రీన్ మంకీస్ చౌరస్తా సమీపంలో ఉంటూ.. కంటెంట్ రైటర్గా పనిచేస్తున్నది. ఈనెల13న రాత్రి తన స్నేహితుడు జన్మదిన వేడుకలు జూబ్లీహిల్స్లోని ఓ పబ్లో నిర్వహించగా, బాధితురాలు మరికొందరు మిత్రులతో కలిసి హాజరైంది. రాత్రి 11.30 గంటల వరకు పార్టీ జరుపుకొన్న అనంతరం రోషన్(23) అనే యువకుడితో పాటు మరో ముగ్గురు స్నేహితులు సదరు యువతిని ఆమె ఇంటికి చేర్చారు. నలుగురిలో ఒకరు ఇంటికి వెళ్లిపోగా, మిగతా వారు అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో ఉదయం 6.15 గంటల సమయంలో నిద్ర మత్తులో ఉన్న ఆమెపై రోషన్ అఘాయిత్యం చేయబోతుంటే.. మేల్కొంది. ఎంత బతిమిలాడినా.. వినకుండా రోషన్ ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు వాష్రూంకు వెళ్లి జరిగిన ఘోరాన్ని స్నేహితులకు ఫోన్ చేసి.. కాపాడాలని కోరింది. అంతలో రోషన్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
జవహర్నగర్ పీఎస్ పరిధిలో..
బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. జవహర్నగర్లోని గబ్బిలాల్పేటలో నివాసముండే రవి (22) గత ఏప్రిల్లో సమీపంలో ఉండే బాలిక(14)పై అనేకసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలికి కడుపునొప్పి రావడంతో స్థానిక ఆర్ఎంపీని సంప్రదించగా, గర్భవతి అని నిర్ధారణ అయింది. మైనర్ కావడంతో 20 సంవత్సరాలు ఉన్నట్లు వయస్సు రాయించి.. స్కానింగ్ చేయించారు. నిందితుడి బంధువులు బాధితురాలి కుటుంబసభ్యులను బెదిరించి అబార్షన్ చేయించారు. కాగా, గురువారం బాలిక తల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.