హైదరాబాద్ : వారిద్దరూ మంచి స్నేహితులు. ఒకరికొకరు అండగా ఉంటూ స్నేహానికి చిహ్నంగా నిలిచారు. కానీ అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదనే కోపంతో స్నేహితుడిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన నగరంలోని ముషీరాబాద్ పోలీసు స్టేషన్లో పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన సోను(27) అనే యువకుడు నగరానికి ఆరేండ్ల క్రితం వచ్చాడు. ముషీరాబాద్లో స్థిరపడ్డ సోను.. భరత్నగర్కు చెందిన ఓ వ్యక్తి వద్ద కార్పెంటర్గా పని చేస్తున్నాడు. ముషీరాబాద్లోని ఓ మటన్ షాపులో పని చేసే అల్తాఫ్ఖాన్(28), సోను స్నేహితులు. అయితే మూడు నెలల క్రితం అల్తాఫ్ఖాన్ వద్ద సోను రూ. 2 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి వీరిద్దరూ కలిసి మద్యం సేవించారు. ఈ సమయంలో అప్పు విషయమై ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది.
తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన అల్తాఫ్ఖాన్.. మటన్ షాపులోని కత్తిని తీసుకొచ్చి సోనుపై దాడి చేసి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సోను మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.