సిటీబ్యూరో: మహా నగరానికి తాగునీరు అందిస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్ల్లయి ఫేజ్-1లో సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి వద్ద రైల్వే క్రాసింగ్ దగ్గర 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపులైన్ బ్రిడ్జి పాసింగ్ – బైపాసింగ్, ఇంటర్ కనెక్షన్ పనులను జలమండలి ఎండీ దానకిశోర్ శనివారం పరిశీలించారు. నూతన రైల్వే ట్రాక్కు ఇబ్బంది కలుగకుండా బ్రిడ్జి ఓవర్, పైపులైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అనుకున్న సమయం 66 గంటల కంటే ముందే 48 గంటల్లో పనులు పూర్తి చేయాలని ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్లాలని సూచించారు. భారీ పైపు లైన్ కావడంతో పనులు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు. ముఖ్యంగా వెల్డింగ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న టీమ్ల కంటే రెట్టింపు మందితో పని చేయాలని ఎండీ పేర్కొన్నారు. అవసరమైతే తగిన సాంకేతిక నిపుణుల సాయం తీసుకోవాలన్నారు.
క్షేత్రస్థాయిలో పనులు పరిశీలన అనంతరం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే డివిజన్ల సీజీఎం, జీఎంలతో ఎండీ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. 48 గంటల్లో పనులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభావితమయ్యే ప్రాంతాల్లో 10న ఎట్టి పరిస్థితుల్లో నీరు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. అప్పటి వరకు ఆయా ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలన్నారు. మరమ్మతు పనుల వల్ల నగరంలో దాదాపు 2.5 లక్షల కనెక్షన్లకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. స్లమ్, బస్తీలకు ప్రాధాన్యమిస్తూ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీరందించాలన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, ఆస్పత్రులకు సైతం ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలన్నారు. అవసరాన్ని బట్టి ప్రైవేటు ట్యాంకర్ల సేవలను ఉపయోగించుకోవాలన్నారు.
ఆయా ప్రాంతాల్లో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లలో ఎప్పటికప్పుడు తగినంత నీరు ఉండేలా చూసుకోవాలని ఎండీ తెలిపారు. 24 గంటలూ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. నీటి సరఫరా అంతరాయం సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయాలన్నారు. స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో మాట్లాడి వారితో సమావేశాలు నిర్వహించి నీటిని నిల్వ చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. సంపులు, స్టోరేజీ సామర్థ్యం ఉన్న వాళ్లు నీటిని నిల్వ చేసుకోవాలని, ప్రజలందరూ ఈ సమయంలో నీటి వృథాను అరికట్టి, పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు. కాగా, సిరిసిల్ల జిల్లాలోని కొత్తపల్లి వరకు దక్షిణ మధ్య రైల్వే నూతనంగా రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టింది. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద ఈ ట్రాక్ వేసే దగ్గర హైదరాబాద్కు నీటి సరఫరా చేసే గోదావరి మెయిన్ వాటర్ పైపు లైన్ ఉంది. ట్రాక్ క్రాసింగ్ కోసం ఆ పైపులైన్కు బ్రిడ్జి పాసింగ్ – బైపాసింగ్, ఇంటర్ కనెక్షన్ పనులు చేపడుతున్నారు.