మన్సూరాబాద్, ఆగస్టు 18 : నర్సింగ్లో డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన దళిత విద్యార్థులకు ఉచిత ఉపాధి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సింగ్ ఎండీ సీహెచ్. సునీత తెలిపారు. నాగోల్ డివిజన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణా తరగతులు ఆరు నెలల పాటు నిర్వహించనున్నామని తెలిపారు.
శిక్షణా తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రొగ్రాంలో భాగంగా విద్యార్థులకు ఐఈఎల్టీఎస్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ స్కిల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.
శిక్షణ అనంతరం కెనడా, లండన్ తదితర దేశాలతో పాటు దేశంలోని వివిధ కార్పొరేట్ దవాఖానల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఉపాధి శిక్షణా తరగతులకు సంబంధించిన సమాచారం వనస్థలిపురంలోని బాటా షోరూం నాల్గవ అంతస్తులో లభిస్తుందని తెలిపారు. వివరాలకు సెల్నెంబర్: 6309164343, 6309165353లో సంప్రదించాలని ఆమె కోరారు.