సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : సాగర తీరం సందర్శకులతో కిటకిటలాడింది. కొన్నాళ్ల విరామం తర్వాత మొదలైన సండే ఫన్డే కార్యక్రమానికి భారీ సంఖ్యలో సందర్శకులు తరలి వచ్చి ఉత్సాహంగా గడిపారు. ఏటు చూసినా విద్యుత్ కాంతులతో ధగధగలాడే తెలంగాణ కొత్త సచివాలయం..సాగర్ జలాల్లో మౌనంగా ఉండే బుద్ధుడి రూపం..వీటికి ప్రత్యేకాకర్షణగా హుస్సేన్ సాగర్లో జలాల్లో ఇటీవల ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెయిన్ సరికొత్త సందడికి వేదికైంది. రాష్ట్ర పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ట్యాంక్బండ్పై నిర్వహించిన సండే ఫన్డేలో నగర వాసులు ఆద్యాంతం ఉత్సాహంతో గడిపారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ( హెచ్ఎండీఏ) అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఒకేసారి వేలా మంది ట్యాంక్బండ్పై సరదాగా గడిపేలా.. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సాయంత్రం నుంచే ట్రాఫిక్ను లోయర్ ట్యాంక్బండ్ మీదుగా మళ్లించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉచితంగా మొక్కల పంపిణీ, ఫుడ్ స్టాల్స్, హ్యాండీ క్రాప్ట్స్, హ్యాండ్లూమ్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ట్యాంక్బండ్పైకి వచ్చిన వారంతా కుటుంబ సమేతంగా స్నేహితులతో సరదాగా గడిపారు.
సందర్శకులకు బంఫర్ ఆఫర్..
కొత్తగా నగరానికి చేరిన 3 డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను సండే ఫన్డే కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా నడిపారు. హుస్సేన్సాగర్ చుట్టూ ఉన్న మార్గంలో వీటిని నడిపామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత నగరానికి డబుల్ డెక్కర్ బస్సులను తీసుకువచ్చిన ప్రభుత్వం నగర వాసులకు అందుబాటులో ఉంచింది. సందర్శకులకు బంఫర్ ఆఫర్గా ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేలా హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేసింది. బస్సుల్లో ప్రయాణం చేస్తూ నగర వాసులు ఎంజాయ్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను ఎక్కామని, అందులో ప్రయాణం చేయడం చాలా ఉత్సాహన్నిచ్చిందని తెలిపారు. ఎంతో అత్యాధునికంగా ఉన్న బస్సుల్లో ఏసీ ఉందని, సీటింగ్ ఏర్పాట్లు, అందులో హుస్సేన్సాగర్ చుట్టూ ప్రయాణించడం సరికొత్త అనుభూతిని పొందామని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఉచితంగా మొక్కల పంపిణీ..
సన్డే ఫన్డే కార్యక్రమంలో భాగంగా ట్యాంక్బండ్పై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వ్యంలో ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు. నగరం వాసులు ఎంతో ఆసక్తిగా మొక్కలను పరిశీలించారు. పచ్చదనం పెంపొందించడం కోసం హెచ్ఎండీఏ పెద్ద మొత్తంలో మొక్కలను పెంచి సంరక్షిస్తున్నది. దీనిపై నగర వాసులకు అవగాహన కల్పించారు.