Hyderabad | వెంగళరావునగర్, మే 17 : తెలంగాణ హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.5 లక్షలకు టోకరా వేసింది ఆ కిలాడి లేడీ. హైకోర్టులో తాను న్యాయవాదినని.. జడ్జీలతో తనకు పరిచయాలు ఉన్నాయని.. రూ.15 లక్షలు ఇస్తే రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికింది. అడ్వాన్స్గా రూ.6.5 లక్షలు తీసుకుని ఉడాయించింది ఆ మాయలాడి.
ఎస్సై శివ శంకర్ కథనం ప్రకారం.. వెంగళరావునగర్ కాలనీలో నివాసం ఉండే ఎస్.జీవన్ విజేందర్(35) 2022లో ఉద్యోగాన్వేషణలో ఉన్నప్పుడు టైలరింగ్ షాపు నిర్వహించే తన అత్త ఉర్మిలాదేవి ద్వారా అంబర్పేటకు చెందిన బి. ప్రసన్నరెడ్డి అనే మహిళ పరిచయమైంది. తనకు తాను హైకోర్టు అడ్వకేట్ అని గొప్పలు చెప్పుకుని పరిచయం చేసుకుంది. తనకు చాలా మంది హైకోర్టు న్యాయమూర్తులతో పరిచయాలు ఉన్నాయని బడాయి మాటలు చెప్పింది. రూ.15 లక్షలు ఇస్తే తెలంగాణ హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మి 2023 ఆగస్టు నెలలో రూ.6.5 లక్షలు ముట్టచెప్పారు. రోజులు గడుస్తున్నా ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో గట్టిగా నిలదీశారు. ఉద్యోగం ఇంకా ప్రాసెస్లో ఉందని చెప్పింది. వారిని నమ్మించి మిగతా రూ.8.5 లక్షలు వసూలు చేయాలని పథకం వేసింది.
ఈ క్రమంలో శైలజారెడ్డి అనే మహిళను హైకోర్టు న్యాయమూర్తి అని చెప్పి పరిచయం చేసింది. అతని అసిస్టెంట్ ఫిరోజ్ ఖాన్ అని చెప్పి వారిద్దర్నీ పరిచయం చేసింది. త్వరలోనే ఉద్యోగం వస్తుందని చెప్పి మరో ఆరు నెలల సమయం తీసుకున్నారు. ఈ క్రమంలో రవి అనే వ్యక్తి ఫోన్ చేసి తాను ప్రసన్న రెడ్డి చేతిలో తాను మోసపోయనని.. తాను కూడా ఉద్యోగం కోసం ఆమెకు రూ.4.5 లక్షలు ఇచ్చినట్లు ఆ వ్యక్తి తెలిపాడు. ఆ మాయలేడి ప్రసన్నరెడ్డిని సంప్రదించేందుకు ప్రయత్నించిగా.. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దాంతో అంబర్పేటలోని ప్రసన్నరెడ్డి నివాసానికి వెళ్లగా అక్కడ ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.