బంజారాహిల్స్, జూలై 6: టాస్క్ఫోర్స్లో హెడ్కానిస్టేబుల్నంటూ.. విజయవాడలోని ఓ షోరూం నిర్వాహకులను బెదిరించిన ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్లో అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన కొనకంచి కిరణ్కుమార్(30) కృష్ణానగర్ బీ బ్లాక్లో నివాసముంటున్నాడు. విజయవాడలోని సోనోవిజన్ షోరూమ్కు ఫోన్ చేసి.. తాను లక్డీకాపూల్లోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు.
మీ స్టోర్ నిర్వాహకులపై చీటింగ్ కేసు నమోదైందని, హైదరాబాద్కు వచ్చి తనను కలవాలంటూ సూచించాడు. స్టోర్ ఉద్యోగి రహ్మతుల్లా షరీఫ్ ఇటీవల నగరానికి రాగా, చీటింగ్ కేసులో అరెస్ట్ చేయకుండా వదిలిపెడుతున్నందుకు తనకు ఓ ఏసీ ఇప్పించాలని చెప్పాడు. పంజాగుట్టలోని సోనో విజన్ స్టోర్లో ఏసీని ఎంపిక చేసుకున్న కిరణ్.. కేసు పూర్తయిన వెంటనే దీన్ని తన ఇంటికి పంపించాలని చెప్పాడు. గత నెల 20న మరోసారి విజయవాడకు వెళ్లిన కిరణ్.. సోనోవిజన్ నిర్వాహకుడితో పాటు మిగిలిన వారిని అరెస్ట్ చేస్తానంటూ హంగామా చేశాడు. వారికి అనుమానం వచ్చి వాకబు చేయగా, టాస్క్ఫోర్స్ పోలీసు కాదని తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విజయవాడ పోలీసులకు అప్పగించారు.