హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ‘అక్షర గోల్డ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఓ కంపెనీ స్థాపించి, అమాయక ప్రజల నుంచి రూ.50 లక్షలకు పైగా వసూలు చేసి పరారైన వైట్కాలర్ నేరస్తుడు పూరి కిరణ్ను సీఐడీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపూర్ గ్రామానికి చెందిన పూరి కిరణ్.. స్నేహితులైన తెప్పలి సురేశ్బాబు, కిశోర్బాబు, నరేశ్ శెట్టి, జలదుర్గం మహేశ్తో కలిసి ‘అక్షర గోల్డ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీని స్థాపించాడు.
దీని ద్వారా ‘రియల్ ఫుడ్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్’ నుంచి రాయల్టీ ఇన్కమ్ వస్తుందని ప్రజలను నమ్మించారు. వీటితోపాటు ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా పలు దొంగ పథకాలు ప్రవేశపెట్టి అమాయక ప్రజల నుంచి పెట్టుబడులు, డిపాజిట్ల రూపంలో భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారు. దీంతో పూరి కిరణ్పై 2013లో పలు కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి పరారీలో ఉన్న కిరణ్ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కిరణ్ను అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన సీఐడీ ఎస్పీ వెంకటలక్ష్మి, ఇన్స్పెక్టర్ ఆర్.రమేశ్, సీహెచ్ నాగార్జున్, ఎస్.నర్సయ్యలను సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ అభినందించారు.