సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): నకిలీ ఐడీలతో ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్ తదితర సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి.. అమాయక ప్రజలను మోసగిస్తూ లక్షలు దోచుకుంటున్న ఒక ఘరానా మోసగాడిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నంకు చెందిన తమ్మారెడ్డి శశాంక్రెడ్డి (24) ఉపాధి కోసం నగరానికి వలసొచ్చి జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ ఐడీలతో సోషల్ మీడియా ఖాతాలను తెరిచాడు. అమాయక యువతీ యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతాడు. అమ్మాయిలకు అబ్బాయిగా లేదా.. అమ్మాయిగాను, యువకులకు ఆమ్మాయిగా ఉన్న ఐడీలతో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతాడు. అనంతరం వారిని మాయమాటలతో నమ్మించి.. అందినంత దండుకుంటాడు. ఈ క్రమంలోనే నగరానికి చెందిన రవికుమార్కు ‘మేఘన రఘుపట్రుని’ అనే యువతి పేరుతో సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్ రిక్వెస్టు పెట్టాడు. దీనిని అంగీకరించిన రవికుమార్ తరచూ చాట్చేస్తూ అతడి మాయమాటలకు ఆకర్శితుడయ్యాడు. అంతేకాకుండా.. వివాహం చేసుకుంటానంటూ మేఘన పేరుతో చాట్ చేసిన నిందితుడు.. రవికుమార్ను నమ్మించాడు. ఈ క్రమంలో వివిధ కారణాలు చూపుతూ రవికుమార్ వద్ద నుంచి పేటీఎం, ఫోన్పే ద్వారా రూ.1.05లక్షలు దండుకున్నాడు.
అయితే, నగరంలోనే ఉంటున్న మేఘన వ్యక్తిగతంగా కలవకపోవడంతో అనుమానం వచ్చిన రవికుమార్ మోసపోయినట్లు భావించి, సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టగా.. మేఘన ముసుగులో ఉన్నది యువతి కాదు.. శశాంక్రెడ్డి అని తేలింది. ఈ మేరకు సైబర్క్రైమ్ పోలీసులు సోమవారం శశాంక్రెడ్డిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే, గతంలో కూడా చైతన్యపురి పోలీసుస్టేషన్ పరిధిలో ఓ బాలికను మోసం చేసిన కేసులో అరెస్టయిన శశాంక్ రెడ్డి.. జైలు శిక్ష అనుభవించాడు. అయినా తీరు మార్చుకోకుండా నకిలీ ఐడీలతో 50 వరకు సోషల్మీడియా ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్నాడు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి ఆదేశాల మేరకు సైబర్క్రైమ్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ చంద్రకాంత్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ కె.రవికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే గుర్తుతెలియని వారితో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.