బంజారాహిల్స్,మే 24: మనీ సర్కులేషన్ స్కీమ్లో(Money circulation scheme) పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయంటూ నమ్మించి మోసం(Fraud) చేసిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే..వెంకటగిరిలో నివాసం ఉంటున్న బంగి రవికుమార్ అనే వ్యక్తి ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు. రెండేళ్ల క్రితం అతడికి ఇందిరానగర్కు చెందిన కొండా రవి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.
తాము కనకలక్ష్మి సేవింగ్స్(Kanakalakshmi Savings) పేరుతో మనీ సర్కులేషన్ స్కీమ్ పెట్టామని, నెలకు రూ.2వేలు కడితే లాభాలు వస్తాయని, మద్యలో లక్కీ డ్రా ద్వారా బహుమతులు వస్తాయని నమ్మించాడు. దీంతో 22 నెలల పాటు డబ్బులు కట్టిన తర్వాత సంస్థను మూసేసిన కొండా రవి బిచాణా ఎత్తేశాడు. ఇటీవల ఈ విషయం తెలుసుకున్న బాధితుడు తాను మోసపోయినట్లు గ్రహించి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ 420తోపాటు సెక్షన్ 3,4 ఆఫ్ ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్కులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.