బంజారాహిల్స్, మే 9: పెండ్లి సంబంధం పేరుతో యువతిని పరిచయం చేసిన స్నేహితుడు.. అమెతో కలిసి రకరకాల కారణాలు చెప్పి డబ్బులు లాగి మోసం చేశాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని కోనసీమ జిల్లా రాజోలు మండలానికి చెందిన నానీ కుమార్(42)కు అదే గ్రామానికి చెందిన పసుపులేటి తాతా శ్రీనివాస్ స్నేహితుడు. శ్రీకృష్ణానగర్లో నివాసముంటున్న నానీకుమార్ తనకు సరైన పెండ్లి సంబంధాలు రావడం లేదంటూ స్నేహితుడు శ్రీనివాస్కు చెప్పాడు. దీంతో తనకు ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉన్న గెడ్డం శ్రావణి మణికొండలో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోందని, ఆమెను పరిచయం చేసి పెండ్లికి ఒప్పిస్తానని శ్రీనివాస్ నమ్మబలికాడు.
కొన్నిరోజుల తర్వాత శ్రావణి ఫోన్ నంబర్ ఇవ్వడంతో నానీకుమార్ చాటింగ్ ప్రారంభించాడు. ఇద్దరం కలిసి మాట్లాడుకుందామంటూ కోరడంతో సాకులు చెప్పి తప్పించుకుంది.చాటింగ్ ద్వారానే స్నేహాన్ని కొనసాగిద్దామని.. త్వరలోనే పెండ్లి ఏర్పాట్లు చేసుకుందామని నమ్మబలికింది. తన తల్లిదండ్రులకు బాగాలేదని.. వారి వైద్యం కోసం సాయం చేస్తే తిరిగి డబ్బులు ఇస్తానని శ్రావణి కోరడంతో ఆమె సూచించిన పలు అకౌంట్లకు సుమారు రూ.10 లక్షలు పంపాడు. అయితే కొన్ని రోజులుగా నానికుమార్ మెసేజ్లకు శ్రావణి, శ్రీనివాస్లు ఇద్దరూ స్పందించకపోవడంతో మోసం చేశారని భావించిన బాధితుడు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.