సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ఆందోళనకు గురువుతున్న ప్రజలు స్వయంగా ఆక్సిజన్ లెవల్స్… బీపీ, షుగర్లు చెక్ చేసుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం కొందరు యాప్లను ఆశ్రయిస్తున్నారు. అందులో వేలిముద్రలు పెట్టి.. పరిశీలించుకుంటున్నారు. అయితే ఇలాంటి యాప్లపై దృష్టి పెట్టిన సైబర్ నేరగాళ్లు నకిలీవి తయారు చేసి.. ఖాతాలు కొల్లగొట్టే ప్రమాదం ఉంది. వేలిముద్రలను సేకరించేందుకు ప్రత్యేక లింక్లు, యాప్లను రూపొందిస్తున్నారు. వాటిని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఆ లింకులను తెరిస్తే వాటి ద్వారా ఫోన్లో ఉన్న సమాచారాన్ని కాజేసే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. బీపీ, షుగర్, ఆక్సిజన్ లెవల్స్ను తెలుసుకునేందుకు ఉపయోగించే యాప్లు సురక్షితమేనా అనేది నిర్ధారించుకోవాలని, ఆ తర్వాతే ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే లింకులు, యాప్లకు వేలిముద్రలు ఇవ్వద్దని సూచిస్తున్నారు.