బంజారాహిల్స్,జూలై 13: తాను దేవుని దూతనని, తన శక్తులతో ఎలాంటి బాధలనైనా తీరుస్తానని నమ్మిస్తూ ప్రార్థనల పేరుతో అమాయకుల వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న మహిళను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 70లోని హుడా హైట్స్లో నివాసముంటున్న ఓ వ్యాపారి కుమార్త్తె సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది. ఆమెకు 2018 ఎంగేజ్మెంట్ అయ్యింది. కాగా, పెండ్లి కొడుకుకు సంబంధించిన కొన్ని విషయాలు తెలియడంతో ఏడాది తర్వాత పెండ్లి రద్దు చేసుకున్నారు. దీంతో యువతి డిప్రెషన్కు లోనైంది. అదే సమయంలో కూకట్పల్లి నివాసి కాకి సంజన (50)తో యువతికి పరిచయం ఏర్పడింది. తాను దైవదూతనని, తనకున్న శక్తులతో పాటు తన ప్రార్థనలతో సాంత్వన కలిగిస్తానంటూ నమ్మించిన సంజన.. బాధితురాలు (యువతి) వద్దనుంచి భారీ మొత్తంలో డబ్బులు లాగడం మొదలుపెట్టింది.
అయితే, ఆమె ప్రార్థనల వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా కుటుంబ సభ్యులపై కూడా తప్పుడు అభిప్రాయాలు కలిగించేలా సంజన బోధనలు చేయడం ప్రారంభించింది. గ్రహించిన యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2019 మే నెల నుంచి తన కూతురు వద్ద నుంచి సంజన సుమారు రూ. 70లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిందని, సంజనతో పాటు ఆమె కూతురు పల్లవి బ్యాంక్ అకౌంట్స్లోకి డబ్బులు వెళ్లాయని ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం వెలుగుచూసింది. సంజన ప్రార్థనల పేరుతో చాలా మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుతో కాకి సంజనపై ఐపీసీ 406, 420, 508 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితురాలు సంజనను మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.