కాచిగూడ,జూన్ 23: ఇండియన్ ఆర్మీ అంటూ సబ్బులను తక్కువ ధరలోనే తయారు చేసి ఇస్తామంటూ నమ్మించి.. డబ్బులు దండుకున్న సంస్థపై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మేము ఇండియన్ ఆర్మీ ద్వారా అతి తక్కువ ధరకే సబ్బులను తయారు చేసి ఇస్తామని ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చారు. ఆ ప్రకటనలకు ఆకర్శితులైన బర్కత్పుర ప్రాంతానికి చెందిన దీపక్కుమార్ కుమారుడు వరుణ్కుమార్ ఈ నెల 18న ఆన్లైన్లో రూ.15 వేలు, 12వేలతో పాటు మొత్తం రూ.60వేలను ఆన్లైన్ ద్వారా పంపించాడు. కొన్ని గంటల తరువాత ఫోన్ చేయగా స్విచ్చాఫ్గా వచ్చింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు బుధవారం కాచిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.