గోల్నాక, ఫిబ్రవరి 21: వీధి కుక్కల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అంబర్పేటలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్.. నాలుగేండ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వచ్చి అంబర్పేట ఎరుకల బస్తీలో నివాసముంటున్నాడు. అంబర్పేట ఛే నంబర్ వద్ద ఓ కారు సర్వీసింగ్ సెంటర్లో వాచ్మన్గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. కాగా గత ఆదివారం సెలవు దినం కావడంతో గంగాధర్ తన ఆరేండ్ల కుమార్తె, నాలుగేండ్ల కుమారుడు ప్రదీప్తో కలిసి తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్కు వెళ్లాడు.
కుమారుడిని సర్వీస్ సెంటర్ లోపల ఉంచి తాను పనిచేసుకుంటున్నాడు. అంతలోనే చిన్నారి ప్రదీప్ ఆడుకుంటూ అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కలు వెంటపడి ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.గమనించిన బాలుడి తండ్రి అక్కడికి వచ్చే లోపు తీవ్రగాయాలతో చిన్నారి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని తమ సొంత ఊరుకు తరలించి అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. కాగా బాధిత కుటుంబానికి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రూ.లక్ష ఆర్థిక సహాయం ప్రకటించారు.
బాలుడి మృతి పట్ల ఎమ్మెల్యే దిగ్భ్రాంతి..
వీధి కుక్కల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతి చెందిన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.