మణికొండ, మే 19 :అంతా 25 ఏండ్ల లోపు వారే. చిన్ననాటి నుంచి ఒకే కాలనీలో ఉంటూ కలిసి పెరిగారు. ఒకే చోట చదువుకున్నారు. వీరిలో ఓ యువతికి పెండ్లి కుదరడంతో బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పదకొండు మంది ఒకే కారులో గండిపేటలోని ఓషియన్పార్కుకు బయలుదేరారు. చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా సాగుతున్న స్నేహితుల జర్నీ మార్గమధ్యలోనే విషాదాంతమైంది. ముందు వెళ్తున్న బస్సును ఓవర్టెక్ చేయబోయి రోడ్డుకు పక్కనే ఉన్న లారీని వీరి కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా.. నలుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెలు ఉన్నారు. ఈ హృదయ విదారక సంఘటన నగర శివారు ఖానాపురం పోచమ్మ దేవాలయ సమీపంలో శుక్రవారం చోటుచేసుకున్నది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట ప్రాంతానికి చెందిన ఇమిలిపురి సత్తిబాబు కూతురు దివ్య (19)కు వివాహం కుదిరింది. దీంతో బ్యాచిలర్ పార్టీ నిర్వహించుకునేందుకు శుక్రవారం గండిపేటలోని ఓషియన్పార్కుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చిన్ననాటి స్నేహితులైన నిజాంపేట ప్రాంతానికి చెందిన శివారెడ్డి కూతుళ్లు అంకిత(16), అర్షిత(17), వారి స్నేహితులు నితిన్ (17), తాటి అమృత్ (25)లతో పాటు ఇమిలిపురి సత్తిబాబు కొడుకు అర్జున్ (14), చిన్నావుల వేణుగోపాల్ కూతురు సుమిత (19), చిన్నావుల రాజు కొడుకు ప్రదీప్కుమార్ (17), సత్యవద సుబ్బారావు కూతురు అఖిల (18), తాటి కోటేశ్వర్ కుమారుడు ధనుష్య (19), దుర్గారావు కుమారు షేక్ ప్రసాద్ (19)తో కలిసి శుక్రవారం ఉదయం (టీఎస్08జి డబ్ల్యూ3102-రెనాల్డ్ ట్రిగర్) కారులో బయలుదేరారు. అంతా కలిసి ఒకే కారులో గచ్చిబౌలి, నార్సింగి మీదుగా ఖానాపురం వరకు వచ్చి అక్కడి నుంచి ఓషియన్పార్కు వెళ్తుండగా ఖానాపురం పోచమ్మ దేవాలయ సమీపంలో ముందు వెళ్తున్న బస్సును ఓవర్ టేక్ చేయబోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని అతివేగంగా వచ్చి ఢీ కొట్టారు. కాగా ప్రమాద సమయంలో కారు దాదాపుగా వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.
అక్కడికక్కడే ముగ్గురు మృతి
లారీ ఢీ కొట్టగానే కారులో ముందు కూర్చున అంకిత(16), నితిన్ (17), వెనుక సీట్లో కూర్చున్న అర్షిత (17)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో ఉన్న పదకొండు మందిలో ముగ్గురు మృతిచెందగా మిగతా 8మందిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ తాటి అమృత్(25) మృతిచెందాడు. వీరితో పాటు అర్జున్ (14), ప్రదీప్కుమార్ (17), షేక్ ప్రసాద్ (19) పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అదేవిధంగా మిగతా నలుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. వీరంతా చిన్నప్పటి నుంచి ఒకే ప్రాంతంలో చదువుకుని ప్రస్తుతం వివిధ కళాశాలల్లో ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తిచేసినట్లు తెలిసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి శుక్రవారం రాత్రి వారి కుటుంబ సభ్యులకు భౌతికకాయాలను అందజేసినట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే వారి ప్రాణాలను తీసిందని ఘటనాస్థలాన్ని సందర్శించిన శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి తెలిపారు. ఘటనా స్థలంలో నార్సింగి ఏసీపీ రమణాగౌడ్, ఇన్స్పెక్టర్ శివకుమార్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఒకే కుటుంబంలో అక్కాచెల్లెలు దుర్మరణం
స్నేహితురాలు ఇచ్చే పార్టీ కోసం ఇంట్లో తల్లితండ్రులను ఒప్పించి చివరకు అక్కాచెల్లెలు ప్రాణాలను కోల్పోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. నిజాంపేట ప్రాంతానికి చెందిన శివారెడ్డి ఇద్దరు కూతుళ్లు ఒకేసారి కారులో దుర్మరణం చెందడంతో తండ్రి రోదనలను ఎవ్వరూ ఓదార్చలేకపోయారు. నాన్నా ఫ్రెండ్ ఇచ్చే పార్టీయేగా మేం వెళ్తాం.. అంటూ బ్రతిమిలాడితే పంపించానంటూ తన కూతుళ్ల మృతదేహాలను చూసి బోరున విలపించాడు. అతివేగమే తన పిల్లల ప్రాణాలు తీసిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. రోడ్డు పక్కన వాహనం నిలపడం కూడా ప్రమాదానికి కారణంగా స్థానికులు తెలుపుతున్నారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కోరారు.
నిజాంపేటలో విషాదఛాయలు
శుక్రవారం ఉదయం నార్సింగి సీబీఐటీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందిన సంఘటనతో నిజాంపేట్ కార్పొరేషన్ పరసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకు సంతోషంగా గడిపిన యువతీ, యువకులు రెండుగంటల వ్యవధిలోనే ప్రమాదానికి గురై నలుగురు మృతి చెందడం, మిగతావారు క్షతగాత్రులుగా మారడం స్థానికులను కలచివేసింది. ప్రమాదానికి గురైన వారి కుటుంబాలు ఏపీ నుంచి వలసవచ్చిన వారే కావడం గమనార్హం. వీరిలో కొన్ని కుటుంబాలు వాచ్మెన్లుగా పనిచేస్తుండగా మరికొన్ని కుటుంబాలకు చెందిన వారు చిన్న, చిన్న పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
జాన్ 2న దివ్య పెండ్లి.. అంతలోనే విషాదం..
ఏపీకి చెందిన దివ్య తల్లితండ్రులు గతకొన్నేండ్ల కిందట వలస వచ్చి నిజాంపేట్ గ్రామ పంచాయతీ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. ఇటీవల దివ్య ఇంటర్ పూర్తిచేయగా పెండ్లి నిశ్చయమైంది. జూన్ 2న వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది.