ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 4: మద్యం మత్తు.. రాంగ్ రూట్లో అతివేగంగా కారును డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి ఆటోను ఢీకొట్టాడు. నలుగురికి గాయాలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుల కథనం ప్రకారం.. హబ్సిగూడలో ఫుడ్ పాయింట్ నిర్వహించే మౌర్య అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. సుమారు ఎనిమిది గంటల సమయంలో ఫోర్డ్ ఈకో స్పోర్ట్ కారును డ్రైవింగ్ చేస్తూ సికింద్రాబాద్ బయలుదేరాడు.
రాంగ్రూట్లో అతివేగంగా కారును డ్రైవింగ్ చేస్తూ హబ్సిగూడ నుంచి రామంతాపూర్ వైపు వెళ్తున్న ఓ ఆటోతోపాటు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఆటో డ్రైవర్ మల్లికార్జున్తో పాటు ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి కూడా గాయపడ్డాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆటోడ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మౌర్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.