– పరారీలో ముగ్గురు….గాలిస్తున్న పోలీసులు
– నిందితుల నుంచి 1.2కిలోల గంజాయి
సికింద్రాబాద్ : గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు ముఠా సభ్యుల్లో నలుగురిని బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇందులో ఒకరు మైనర్ కావడం విశేషం. బోయిన్పల్లి సీఐ రవికుమార్ కథనం ప్రకారం ఫిల్మ్ నగర్ బీజేఆర్ నగర్కు చెందిన ఎ1 యావ నవీన్, ఎ2 మానేకర్ మదన్, ఎ3 మాన్షి అనే మహిళ ఒక ముఠాగా ఏర్పడి గంజాయిని విక్రయిస్తున్నారు.
వీరి వద్ద గాజుల రామారం దేవేందర్ నగర్ చెందిన ఎ4 షేక్ అమీర్, ఎ5 కె. సాయిరాంరెడ్డి అలియాస్ డీజే సాయి, ఎ6 షేక్ సల్మాన్లు ఓ మైనర్ బాలుడితో కలసి గంజాయిని కొనుగోలు చేసి తెలిసిన వ్యక్తులకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బోయిన్పల్లిలోని ఓల్డ్ డైరీ ఫాం రోడ్డులో పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందికి ఈ ఏడుగురు అనుమానస్పదంగా కంట పడ్డారు.
దీంతో పోలీసులు వీరిని పట్టుకోవడానికి ప్రయత్నించగా యావ నవీన్, మానేకర్ మదన్, మాన్షి అనే మహిళ తప్పించుకున్నారు. ఇక మిగిలిన షేక్ అమీర్, సాయిరాంరెడ్డి, షేక్ సల్మాన్ తో పాటు మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 1.2కిలోల గంజాయి, మూడు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పరారీలో ఉన్న యావ నవీన్, మానేకర్ మధన్, మాన్షిల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యావ నవీన్, మానేకర్ మదన్లు గంజాయి ఇచ్చేందుకు షేక్ అమీర్, షేక్ సల్మాన్లను డైరీ ఫాం రోడ్డుకు రమ్మని పిలవగా వీరంతా పోలీసుల కంట్లో పడ్డారు. గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన బోయిన్పల్లి పోలీసులను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.