సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో రూ. 500 ఎరవేసి లక్షలు దోచేస్తున్న సైబర్నేరగాళ్ల ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్క్రైమ్స్ డీసీపీ కవిత కథనం ప్రకారం.. గుజరాత్ సూరత్కు చెందిన అబ్దుల్లా ఫరూఖ్ జోంజున్య, ముంబైకి చెందిన సివిల్ కాంట్రాక్టర్ మహ్మద్ షోయాబ్ బాబ్లూ ఖాన్ సైబర్నేరగాళ్ల ముఠాతో చేతులు కలిపారు. పార్ట్టైమ్ జాబ్ అంటూ.. మెసేజ్లు పెట్టి ఆ తరువాత రూ. 500 పార్ట్టైమ్ జాబ్ చేసినందుకు మీకు వచ్చాయంటూ ఎరవేస్తూ, ఆ తరువాత టాస్క్లు, పెట్టుబడి పేరుతో డిపాజిట్లు చేయిస్తున్న సైబర్నేరగాళ్లు అమాయకుల నుంచి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. ఈ విధంగా నగరానికి చెందిన ఒక బాధితుడిని రూ. 2.38 లక్షలు ముంచేయడంతో సైబర్క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ ఎస్.నరేశ్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. బాధితుడు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా నిందితుడు ముంబైకి చెందిన మహ్మద్ షోయబ్ బాబ్లూ ఖాన్ను గత నెల 24న అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారంతో మరో నిందితుడు అబ్దుల్లా ఫరూఖ్ జోంజున్యను రెండు రోజుల కిందట అరెస్టు చేశారు.
సివిల్ కాంట్రాక్టర్ షోయబ్ బాబ్లూ షెల్ కంపెనీల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచి.. అబ్దుల్లా ఫరూఖ్కు అందిస్తుండటంతో.. అమాయకులకు మోసపూరిత మాటలు చెప్పి వాళ్ల నుంచి ఆయా ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేయిస్తున్నాడు. ఒక్క ఖాతాలోనే రూ. 4.5 కోట్ల లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి, బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. నిందితులిద్దరికి 42 కేసులతో సంబంధం ఉండగా.. ఆరు కేసులు తెలంగాణ రాష్ర్టానికి చెందినవిగా పోలీసులు పేర్కొన్నారు. వివిధ బ్యాంకులకు సంబంధించి పదుల సంఖ్యలో చెక్బుక్లు, పాస్బుక్లు, డెబిట్ కార్డులు, సిమ్ కార్డులు, కంపెనీల నకిలీ రబ్బర్ స్టాంప్లతో పాటు రూ. 5 లక్షల నగదును నిందితుల వద్ద నుంచి సీజ్ చేశారు.
వాట్సాప్, టెలిగ్రామ్లో పరిచయమైన సైబర్నేరగాళ్లు బాధితుడికి సౌత్ ఆఫ్రికాకు చెందిన ఉకుచుమ ఫైనాన్స్ సర్వీస్ (ప్రై) లిమిటెడ్ కంపెనీ ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ నిర్వహిస్తుందని, అందులో ట్రేడింగ్ అకౌంట్ తెరిచి, రోజు వారీగా ట్రేడింగ్ చేస్తే భారీ లాభాలొస్తాయంటూ నమ్మించి.. రూ. 66.56 లక్షలు మోసం చేశారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఇన్స్పెక్టర్ నరేశ్ బృందం దర్యాప్తు చేపట్టి.. సైబర్నేరగాళ్లతో చేతులు కలిపిన గుజరాత్కు చెందిన ఠాకూర్ కుల్దీప్ సిన్హా అరవింద్కుమార్, వాఘేల రుత్రాజ్ ఘన్శ్యామ్ సింగ్ను అరెస్ట్ చేశారు. బాధితుడితో తొలుత తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టించి.. లాభాలు చూపించారు. ఆ తరువాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టించి మోసం చేశారు. ఇందులో వాఘేలా బ్యాంకు ఖాతాలు తెరిచి.. కుల్దీప్ సిన్హాకు అందిస్తున్నాడు. ప్రధాన సైబర్నేరగాళ్లు వాటిని వినియోగిస్తూ.. బాధితులను మోసం చేయగా వచ్చిన డబ్బును ఆయా ఖాతాల్లో డిపాజిట్ చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ. 4 కోట్ల టర్నోవర్ నిర్వహించారు. ఈ ఖాతాలపై దేశ వ్యాప్తంగా ఐదు కేసులు నమోదు కాగా, తెలంగాణలో రెండు కేసులు నమోదయ్యాయి.