Cyber Crime | సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): పార్ట్టైమ్ జాబ్ పేరుతో నిరుద్యోగులకు గాలం వేసి, కంపెనీ నియమాలు ఉల్లంఘించారంటూ నకిలీ లీగల్ నోటీసులతో వారిని బెదిరించి లక్షల రూపాయలు దోచుకుంటున్న నలుగురిని సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ సైబర్క్రైమ్ డీసీపీ కె.శిల్పవల్లి కథనం ప్రకారం… గుజరాత్ రాష్ట్రం, సూరత్కు చెందిన రాహుల్ అశోక్ భాయ్ బవిస్కర్(25) స్థానికంగా నకిలీ కాల్సెంటర్లో టెలికాలర్గా పనిచేశాడు. ఆ కాల్సెంటర్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేయడంతో మూతపడింది. దీంతో రాహుల్ ‘ఫ్లోరా సొల్యూషన్’ పేరుతో నకిలీ కాల్సెంటర్ను ఏర్పాటు చేసి, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మిస్తున్నాడు. సూరత్కు చెందిన సాగర్ పాటిల్(24) సదరు కంపెనీలో టెలికాలర్గా పనిచేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన కల్పేష్ థొరట్(26), నీలేశ్ పాటిల్(24) ప్రధాన నిందితుడైన రాహుల్కు బ్యాంకు ఖాతాలను ఏర్పాటు చేస్తారు.
ఈ క్రమంలో రాహుల్ ఉద్యోగాల కోసం వెతికే వారి వివరాలను ఆన్లైన్ ద్వారా సేకరించి, వారికి ఫ్లోరా సొల్యూషన్స్ పేరుతో వాట్సాప్ మెసేజ్లు పంపుతాడు. తమ కంపెనీకి డేటా ఎంట్రీ వర్క్ చేసే వారు అవసరమని, పని ఆధారంగా వేతనం ఉంటుందని నమ్మిస్తాడు. నిందితుడి మెసేజ్కు స్పందించిన వారికి లాగిన్ ఐడీతో పాటు పాస్వర్డ్ పంపిస్తాడు. ఈ క్రమంలోనే పార్ట్టైమ్ జాబ్ కోసం వెతుకుతున్న నగరానికి చెందిన ఒక యువతికి రాహుల్ వాట్సాట్ మెసేజ్ ద్వారా పార్ట్టైమ్ జాబ్ ఉన్నట్లు నమ్మించాడు. దీంతో సదరు యువతి నిందితుడు ఇచ్చిన డేటా ఎంట్రీ వర్క్ను పూర్తిచేసి సమర్పించగా కంపెనీ నుంచి లీగల్ నోటీసులు వచ్చాయి.
దీంతో షాక్కు గురైన యువతి కంపెనీ నిర్వాహకుడైన రాహుల్ను సంప్రదించగా కంపెనీ నియమాలను ఉల్లంఘించినందుకు జరిమానా చెల్లించాలని బెదిరించాడు. భయాందోళనకు గురైన సదరు యువతి రూ.6,17,660 నిందితుడికి చెల్లించింది. ఆలస్యంగా తేరుకున్న బాధితురాలు మోసపోయినట్లు గ్రహించి సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్క్రైమ్ పోలీసులు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్, దండేలి ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు రాహుల్ అశోక్భాయ్ బవిస్కర్తో పాటు అతడికి సహకరించిన సాగర్ పాటిల్, కల్పేశ్ థోరట్, నీలేశ్ పాటిల్ను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 6సెల్ఫోన్లు, ల్యాప్టాప్, డెబిట్ కార్డ్ను స్వాధీనం చేసుకున్నారు.
దేశ వ్యాప్తంగా నిందితులపై మొత్తం 358 కేసులు నమోదై ఉన్నట్లు సైబర్క్రైమ్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. అందులో తెలంగాణకు సంబంధించి 28 కేసులు ఉండగా సైబరాబాద్కు సంబంధించి 11కేసుల్లో నిందితులు నేరాలకు పాల్పడినట్లు వివరించారు.