వ్యవసాయ యూనివర్సిటీ, ఆగస్టు 03 : రాష్ట్ర ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలతో కూడిన విజయ ఆయిల్ను దేశ ప్రజలకు చేరువ చేయాలని కృషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పలు రకాల వంట నూనెలను వినియోగదారులకు సరసమైన ధరలకు విక్రయిస్తున్నందున మంచి ఆదరణ లభిస్తున్నదని తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని రాష్ట్ర కో -ఆపరేటివ్ శివరాంపల్లిలో ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ కర్మాగార నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… సమైక్య పాలనలో మూతపడే స్థితికి వచ్చిన ఈ సెంటర్ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో అంచెలంచెలుగా ఎదిగి నేడు రూ.470 కోట్ల టర్నోవర్ సాధించడం అభినందనీయమన్నారు.
కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడంలో నిర్లక్ష్యం జరిగిందని, రానున్న కాలంలో 10 లక్షల ఎకరాల్లో నూనెగింజల పంటలను సాగు చేయనున్నామని తెలిపారు. వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలోని 3.8 ఎకరాల విస్తీర్ణంలో నూతన టెక్నాలజీతో రూ. 25 కోట్లతో అధునాతనమైన మెగా ప్యాకింగ్ నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో 8 జిల్లాల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్ ఫామ్ సాగవుతుందని వెల్లడించారు. అనంతరం చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… విజయ హైదరాబాద్ వంట నూనెను ఏడాదికి 36 వేల మెట్రిక్ టన్నుల ఆయిల్ ప్యాకింగ్ చేస్తున్నామని, అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్ వాడీ కేంద్రాలతో పాటు రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ ఎండీ , డైరెక్టర్ సురేందర్, సుధాకర్ రెడ్డి, మేనేజర్లు తిరుమలేశ్ రెడ్డి, ప్యాకింగ్ స్టేషన్ మేనేజర్ కె.వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.