బండ్లగూడ, జులై 6 : పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం విస్తరించడంతో మౌలిక వసతులు చేపడుతున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గోల్డెన్ హైట్స్కాలనీలో రూ.2.24 కోట్లతో చేపట్టిన మొగల్ థీమ్ పార్కుకు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్తో కలిసి మేయర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… నగరంలో ఇప్పటి వరకు 57 థీమ్ పార్కులను ఏర్పాటు చేశామని, ప్రజలు సేద తీరేందుకు ఉపయోగపడతాయన్నారు. గోల్డెన్ హైట్స్కాలనీలో ఏర్పాటు చేసే థీమ్ పార్కును 17,641 చదరపు గజాల్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని, ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నగరంలో రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు వంటివి అభివృద్ధి చేశామని తెలిపారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ… 60 ఏండ్లలో జరుగని అభివృద్ధి.. తొమ్మిదేండ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్ , జోనల్ కమిషనర్ వెంకన్న, జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ జగన్, ఈఈ నరేందర్గౌడ్, నాయకులు ధర్మారెడ్డి, వెంకటేశ్, మహేశ్, సయ్యద్ ముజమిల్ అహ్మద్, రజినికాంత్ గౌడ్, యాసిన్ అయూబి, తదితరులు పాల్గొన్నారు.