సిటీబ్యూరో, జనవరి 31(నమస్తే తెలంగాణ): ఫార్ములా- ఈ రేసింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ అన్నారు. ఈ నెల 11న జరిగే ఫార్ములా – ఈ రేసింగ్ కోసం ట్యాంక్ బండ్పై చేపడుతున్న ఏర్పాట్లను మంగళవారం హెచ్ఎండీఏ అధికారులు, ఎఫ్ఐఏ ఫార్ములా ఈ నిర్వహకులు, ప్రమోటర్ గ్రీన్కో హైదరాబాద్ ఈ-ప్రిక్స్ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు తీసుకువస్తున్న ఫార్ములా ఈ రేస్ నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లుగా వెల్లడించారు.
అంతర్జాతీయ స్థాయి పోటీలకు అనుగుణంగా ట్రాక్ నిర్మాణం జరుగుతున్నదని, త్వరలో ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ మార్గాల్లో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వివరించారు. ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపునకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమావేశం నిర్వహించగా.. ఫిబ్రవరి 11 వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని వాహనదారులకు ట్విట్టర్ వేదికగా సూచించారు.
ఆయన వెంట హెచ్ఎండీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, సంతోష్ కుమార్, తదితరులు ఉన్నారు. కాగా హైదరాబాద్ వేదికగా వరల్డ్ రేసింగ్ పోటీలు నిర్వహించడంపై డీ బ్లాక్ మూవీ హీరోయిన్ అవంతిక స్పందించారు. “దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు హైదరాబాద్ ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది” అన్నారు. ట్యాంక్ బండ్పై జరిగే పోటీలకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను ఆమె అభినందించారు.