సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రేసింగ్ పోటీలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19, 20న ఇండియన్ రేసింగ్ ట్రయల్ రన్ లీగ్ జరుగబోతున్నది. అంతర్జాతీయంగా ఆదరణ పొందిన ఈ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఫార్ములా ఈ చాంపియన్షిప్లో భాగంగా ఈ-ప్రిక్స్ జరిగే తొలి భారతీయనగరం హైదరాబాద్ కావడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో కనిపించే రేస్ కార్లు హుస్సేన్ సాగర్ లేక్ చుట్టూ రయ్..రయ్మంటూ దూసుకుపోనున్నాయి. దేశీయ, అంతర్జాతీయ డ్రైవర్ల రేసింగ్ విన్యాసాలు కనువిందు చేయనున్నాయి. రేస్ కార్ల పరుగులు వీక్షించడానికి రేసింగ్ ప్రియులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఈ పోటీలలో 6 టీమ్లు పాల్గొంటుండగా, 2.7 కిలోమీటర్ల పొడవున ట్రయల్ రేసింగ్ సాగనుంది. ప్రతీ టీంలో నలుగురు సభ్యులుండగా అందులో ఇద్దరు అంతర్జాతీయ డ్రైవర్స్ ఉంటారు. కాగా మరో ట్రయల్న్ డిసెంబర్ 10, 11న నిర్వహించనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. గంటకు సుమారు 280 కిలో మీటర్ల వేగంతో బ్యాటరీ కార్లు దూసుకుపోనున్నాయి.
రేసింగ్ మార్గం..
తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ప్రారంభమై సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ ఘాట్ మీదుగా – ఎన్టీఆర్ గార్డెన్ – ఐమాక్స్ -ఇందిరా గాంధీ రోటరీ నుంచి తిరిగి ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్క్వైపు మళ్లుతుంది. అక్కడి నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ను చేరుకుంటుంది. ఈ మార్గం పొడవున 8 మలుపులు ఉన్నాయి. ఈ రేసింగ్ మార్గంలో 25 ప్రాంతాల్లో మార్షల్ పొజిషన్, ఫైర్పోస్ట్, ట్రాక్ సిగ్నల్ లైట్స్ ఉంటుంది. మరో మూడు చోట్ల సేఫ్టీ కార్లు, రికవరీ, ఎమర్జెన్సీ వాహనాలు అందుబాటులో ఉంటాయి.
సీట్ల వారీగా ధరలు
ఈ రేసింగ్ పండుగను వీక్షించడానికి బుక్ మైషోలో టికెట్లు బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. స్టాండ్ 1 నుంచి స్టాండ్ 5 వరకు, ప్రీమియం స్టాండ్, గ్రీన్ స్టాండ్ 1,2, పాడాక్ ప్లాటినం, పాడాక్ గోల్డ్లుగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. వీటిలో ఒక్కో సీటింగ్ విభాగానికి ఒక్కో ధర ఉంటుంది. రూ.749 నుంచి 6,999 వరకు టికెట్ ధరలు ఉన్నాయి. పాడాక్ గోల్డ్కు రూ.4,999కాగా, పాడాక్ ప్లాటినం సీటింగ్కు రూ.6999 ఉంది. స్టాండ్ 1 నుంచి స్టాండ్ 5 వరకు వెయ్యి నుంచి 12 వందల లోపు ధరలు ఉన్నాయి.
హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎండీ సంతోష్
19, 20వ తేదీల్లో ఫార్ములా ఈ -రేసు ట్రయల్ రన్
ఈ నెల 19, 20వ తేదీలతో పాటు వచ్చే నెల 10, 11వ తేదీలలో ఫార్ములా ఈ రేసు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎండీ సంతోష్ తెలిపారు. ఈవెంట్కు నాలుగు రోజుల ముందు రోడ్ను మూసివేస్తాయని , మిగిలిన రోజుల్లో రోడ్ ఓపెన్గా ఉంటుందని వివరించారు. 11 టీంలు, 22 కార్స్ ఈవెంట్లో పాల్గొంటాయని, మహీంద్రా, జాగ్వర్ లాంటి కంపెనీలు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఈ రేస్ 320 కిలోమీటర్ల మేర మాక్సిమం స్పీడ్ ఉంటుందన్నారు. ఫార్ములా ఈ రేసు ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. అనంతరం అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ ప్రభాకర్తో కలిసి సంతోష్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచం మొత్తం హైదరాబాద్ నగరం వైపు చూస్తుందని, హైదరాబాద్ సంస్కృతిని చాటి చెప్పే విధంగా నగరం మధ్యలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. 2.7 కిలోమీటర్ల మేర ట్రాక్ ఏర్పాటులో 214 చెట్లలో 125 సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్లో 81 చోట్ల ఫ్లాంటేషన్ చేపట్టినట్లు తెలిపారు. తిరిగి నాటిన 214 చెట్లను చనిపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
19 నవంబర్శనివారం
ఉ.8-8:30గం వరకు రేసింగ్ లీగ్పై బ్రీఫింగ్
ఉ 9 -10గం వరకు ఇండియన్ రేసింగ్ లీగ్-ఎఫ్పీ1
ఉ 11 నుంచి 12 వరకు ఎఫ్పీ2
మ. 12-మ. 1 వరకు లంచ్ బ్రేక్
సా.3:30 నుంచి 3:45 వరకు రేసింగ్(క్వాలిఫైంగ్)
సా.4నుంచి 4:45 వరకు రేసింగ్-రేస్1
4:45-5 వరకు ఇంటర్వ్యూలు
20 నవంబర్ ఆదివారం
ఉ.11-11:30 వరకు రేసింగ్ లీగ్ ఎఫ్పీ3
మ.12-1వరకు లంచ్ బ్రేక్
మ.1 నుంచి 1:15 వరకు క్వాలిఫైంగ్ లీగ్
మ.2 నుంచి 2:45 వరకు లీగ్ రేస్2
సా.3:30 -4:30 వరకు రేస్3
సా.4:30నుంచి 4:45 వరకు ఇంటర్వ్యూలు