బోడుప్పల్(హైదరాబాద్) : మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ. నరిసింహారావు(PV Narasimha Rao) దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి (MLC Surabhi Vanidevi) అన్నారు. పీ.వీకి కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ప్రకటించిన సందర్భంగా బోడుప్పల్లోని బ్రాహ్మణ భవన్లో అఖిల బ్రాహ్మణ వికాస సమితి ఆధ్వర్యంలో ఆయనకు నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ దేశ ఔనత్యానికి, సమగ్రతకు కృషి చేసిన పీవీకి భారతరత్న (Bharat Ratna) అవార్డు రావడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ అవార్డుతో ఆయన ఖ్యాతి మరింత పెరిగిందని, ఆయన చూపిన మార్గంలో నడుచుకుని దేశ సేవకు నడుంబిగించాలని కోరారు. దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఎంతో మేలు చేశాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేణుగోపాలాచారి, కార్పొరేటర్ భూక్య సుమన్, అఖిల బ్రాహ్మణ వికాస సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి నందకుమార్ జోషి, ప్రభాకర్ రావు, సుభాష్, సుధాకిరణ్, జగన్మోహన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.