అమీర్పేట్, మే 25 : తాగునీటి సరఫరాలో వైఫల్యాలు సామాన్యులను ఎంతలా బాధిస్తున్నాయనే విషయాన్ని అధికారులు స్వయంగా వినియోగదారుల ఇళ్లను సందర్శించి తెలుసుకోవాలని మాజీ కార్పొరేటర్ శేషుకుమారి కోరారు. తాగునీళ్లు ఇవ్వాల్సిందేనంటూ వినియోగదారులు, బీఆర్ఎస్ శ్రేణులు కలిసి ఖాళీ బిందెలతో సోమవారం ఎస్ఆర్నగర్ జలమండలి కార్యాలయంలో ఆందోళన నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. నీటి సరఫరా జరగకపోతే పిల్లలు, వృద్ధులతో కూడిన సామాన్య కుటుంబాలు ఎలా జీవిస్తాయనే విషయాన్ని అధికారులు కనీసం ఆలోచిస్తున్నారా అంటూ మండిపడ్డారు.
కమర్షియల్ ట్యాంకర్లను కొనుగోలు చేయలేని మురికివాడల వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనంగా ఉచిత నీటి ట్యాంకర్ల ద్వారా అయినా సరఫరా చేయమని అడిగితే.. ఇప్పుడు ఉచిత ట్యాంకర్లు వ్యవస్థను రద్దు చేశామని అధికారులు సమాధానాలిస్తున్నారని విమర్శించారు. కమర్షియల్ ట్యాంకర్లు కొనే స్థోమత లేని పేదల బస్తీలకు తాత్కాలిక ఉపశమనంగా ఉచిత ట్యాంకర్లు పంపాలని లేకపోతే నిరసన మరింత తీవ్ర రూపం దాలుస్తుందని ఆందోళన ప్రదర్శన వద్దకు వచ్చిన జీఎం, డీజీఎం, మేనేజర్లకు మాజీ కార్పొరేటర్ స్పష్టం చేశారు.