బంజారాహిల్స్,ఏప్రిల్ 7: జూబ్లీహిల్స్ రోడ్ నెం 18లో జూబ్లీహిల్స్ క్లబ్ ఎదురుగా ఉన్న జీహెచ్ఎంసీ టెన్నిస్ గ్రౌండ్లో ఏడాదిన్నర కాలంగా ప్రైవేటు వ్యక్తులు తిష్టవేసి అనేక అక్రమాలకు పాల్పడుతున్న వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ కథనాలతో అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించింది. రెండ్రోజుల క్రితం జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ విభాగం అదనపు డైరెక్టర్ మోజెస్ టెన్నిస్ కోర్టును సందర్శించి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. భూపాల్ అనే ప్రైవేట్ కోచ్ సుమారు 2వేల గజాల స్థలంలోని కోర్టులన్నీ తన సొంత ఆస్థిల వాడుకుంటున్నాడని, ఎలాంటి అనుమతులు లేకుండా రెండేళ్లుగా ప్రైవేటు అకాడమీ పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.
ఈ మొత్తం వ్యవహారంపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. కాగా అదే ప్రాంగణంలో సుమారు రూ.40కోట్ల విలువైన జీహెచ్ఎంసీ స్థలాన్ని మరికొంతమంది వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా క్రికెట్ కోచింగ్ కోసం వాడుతున్నట్లు ‘నమస్తే తెలంగాణ’ పరిశీలనలో తేలింది. ఈ వ్యవహారంలో లోతుగా పరిశీలన చేపట్టగా ప్రస్తుతం జూబ్లీహిల్స్ వార్డు కార్యాలయంగా కొనసాగుతున్న భవనం గతంలో స్పోర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో ఉండేది. రెండేళ్ల క్రితం ఈ భవనానికి ఎదురుగా ఉన్న సుమారు 1500 గజాల ఖాళీ స్థలాన్ని అప్పట్లో ఇక్కడ విధులు నిర్వహించిన కొంతమంది అధికారుల సహకారంతో చదును చేసిన ప్రైవేటు వ్యక్తులు అక్కడ క్రికెట్ నెట్స్ ఏర్పాటు చేసుకున్నారు. క్రికెట్ కోచింగ్ పేరుతో ఒక్కొక్కరి వద్దనుంచి రూ.5వేల దాకా వసూలు చేస్తున్నారని, జీహెచ్ఎంసీ అధికారుల కనుసన్నలతోనే ఈ మొత్తం వ్యవహారం నడుస్తోందని స్థానికులు తెలిపారు.