సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : ఎన్నో ఏండ్లు కష్టపడి.. ఎంతో ఖర్చు పెట్టి.. ఎన్నో ఫండింగ్ సంస్థల నుంచి నిధులు పొంది పూర్తి చేసిన పరిశోధనలు కేవలం పబ్లికేషన్లకు, డాక్టరేట్లకే పరిమితమవుతున్నాయి. వ్యయ ప్రయాసలకు ఓర్చి.. ఎన్నో సంవత్సరాలు కష్టపడి పూర్తి చేసిన పరిశోధనలు సమాజానికి అందుబాటులోకి రాకుండా నిరుపయోగంగా మారుతున్నాయి. ముఖ్యంగా సాంకేతిక రంగంలో చేసిన పరిశోధనలు కూడా జనజీవనానికి అందుబాటులోకి లేకుండా ఉన్నాయి. అలాంటి పరిశోధనలు.. ఎన్నో వినూత్న కోణంలో పూర్తి చేసుకున్నప్పటికీ అవి మరుగున పడుతున్నాయే తప్ప కార్యరూపం దాల్చడం లేదు. ఇక మరుగున పడిన బ్రహ్మాండమైన పరిశోధనలు అలాగే వదిలేయకుండా.. వాటిని సమాజానికి ఉపయోగపడే విధంగా వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో జేఎన్టీయూ హైదరాబాద్ అధికారులు నిమగ్నమయ్యారు. జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రకారం మరుగున పడిన పరిశోధనలను ‘ల్యాబ్ టు మార్కెట్’ పేరుతో వాటిని వెలికి తీయబోతున్నారు.
ఈ నెల 21, 22 తేదీలలో ఫ్యాకల్టీకి ప్రత్యేక శిక్షణ..
నిరుపయోగంగా ఉన్న పరిశోధనలు వెలికి తీసి, వాటిని సమాజానికి ఎలా ఉపయోగించుకోవాలి..? ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి..? పారిశ్రామిక వేత్తలకు, ఐటి కంపెనీలకు ఏ విధంగా అందుబాటులో ఉంచాలి..? వంటి సమగ్ర అంశాలపై టీచింగ్ ఫ్యాకల్టీకి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి జేఎన్టీయూ పరిధిలోని జే-హబ్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల 21, 22 తేదీలలో జే-హబ్ వేదికగా శిక్షణ ఇవ్వడానికి షెడ్యూల్ నిర్ణయించినట్లు జే-హబ్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.విజయకుమారి తెలిపారు. ఇందుకు సంబంధించి పరిశోధనలు చేసిన ఫ్యాకల్టీకి అవగాహన కల్పిస్తున్నారు. అయితే కేవలం జేఎన్టీయూ హైదరాబాద్కు చెందిన కాలేజీ ఫ్యాకల్టీ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఓయూ, కేయూ, ఎంజీయూ ఇలా ఏ యూనివర్సిటీ ఫ్యాకల్టీకైనా ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో ఇదే తొలిసారి..
నిరుపయోగంగా ఉన్న పరిశోధనలను వెలికి తీసి వాటిని ఇప్పటి సమాజానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవడం కోసం చేస్తున్న కృషి, అందుకు కోసం ఫ్యాకల్టీకి శిక్షణ ఇవ్వడం, పారిశ్రామిక వేత్తల నుంచి పూర్వ విద్యార్థుల వరకు అందరి సహకారం తీసుకోవడం రాష్ట్రంలో ఇదే తొలిసారే అవుతుంది. వీసీ ఆదేశాల ప్రకారం ఇలాంటి కొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు పోతున్నామని జే-హబ్ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు.