శంషాబాద్ రూరల్, మార్చి 26: భూమికి భూమి.. ప్లాట్కు ప్ల్లాట్ ఇస్తేనే రేడియల్ రోడ్డుకు సహకరిస్తామని.. లేనిపక్షంలో భూములు ఇచ్చేదిలేదని నర్కూడ గ్రామసభలో బాధితులు అధికారులకు తేల్చిచెప్పారు. శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్రెడ్డి పాల్గొని బాధితుల అభిప్రాయాలు తీసుకున్నారు. పలువురు బాధితులు మాట్లాడుతూ.. రేడియల్ రోడ్డు అవసరంలేని చోట నిర్మాణం చేపడుతున్నారు.
పాత రోడ్డును వెడల్పు చేయాలని కోరారు. ఖచ్చితంగా రేడియల్ రోడ్డు వేస్తామంటే భూములు కోల్పోతున్న బాధితులకు భూమికి భూమి… ప్ల్లాట్కు.. ప్లాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్ శేఖర్యాదవ్ మాట్లాడుతూ.. అమ్మపల్లి రెవెన్యూ పరిధిలోని 19 సర్వే నంబర్ భూమిలో బాధితులకు భూమి కేటాయించాలని కోరారు. బుర్కుంట సతీష్, బుర్కుంట గోపాల్ మాట్లాడుతూ.. అమ్మపల్లి రెవెన్యూ పరిధిలోని 19 సర్వే నంబర్ భూమిలో అన్నీ కేసులు ఉన్నాయని అందులో కాకుండా ప్రజలకు ఇబ్బందులు లేనిచోట ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని అధికారులను కోరారు. అనంతరం అడిషనపల్ కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. రేడియల్ రోడ్డు భూసేకరణలో భాగంగా జనరల్ అవార్డు, కన్సెంట్ అవార్డు రెండు పద్దతులలో బాధితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇస్తాం. తప్ప భూమికి భూమి ఇచ్చేదిలేదు.
రేడియల్ రోడ్డుకు మాత్రం ఖచ్చితంగా భూములు తీసుకుంటామని తేల్చిచెప్పారు. దీంతో బాధితులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి అక్కడి నుంచి కారు ఎక్కి వెళ్లిపోతుండగా బాధితులు అడ్డుకున్నారు. అధికారులు, సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామసభలో ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు.
నర్కూడ గ్రామ రెవెన్యూ పరిధిలో రేడియల్ రోడ్డు అలైన్మెంట్లో మూడు కుంటల మీదగా పోతున్నాయి. ఇక్కడ దాదాపు 100కు పైగా కుటుంబాలు చేపల వృతి చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వారికి ఆన్యాయం జరిగితే ఊరుకునేది లేదని మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి నర్సింహ, జిల్లా అధ్యక్షుడు నీరటి మల్లేశ్ హెచ్చరించారు.
నర్కూడ గ్రామ పరిధిలోని ఇడిగవాని కుంట, మంగరాసికుంట, కుమ్మరివాని కుంట మూడు కుంటలను పూర్తిగా ధ్వంసం చేస్తు రోడ్డు వేయడం మానుకోవాలన్నారు. ఒకవైపు సీఎం రేవంత్రెడ్డి హైడ్రా పేరుతో చెరువులు, కుంటలను రక్షిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆచారణలో మాత్రం అమలు చేయడంలేదని విమర్శించారు. కుంటలను ధ్వంసం చేసి రోడ్డువేస్తే అడ్డుకోని తీరుతామని హెచ్చరించారు.