సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్లోని ఫ్లై ఓవర్లు పచ్చని అందాలతో కనువిందు చేస్తున్నాయి. కాలుష్యాన్ని నియంత్రించడం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఫ్లై ఓవర్ల పిల్లర్లకు, పలు చోట్ల బ్రిడ్జిలకు వర్టికల్ గార్డెనింగ్ (నిలువుగా మొక్కల పెంపకం) చేపడుతున్నారు. ప్రధానంగా బ్రిడ్జిలపై ఏర్పాటు చేస్తున్న వర్టికల్ గార్డెన్లలో ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. హెరిటేజ్, కల్చర్, డెవలప్మెంట్ థీమ్గా తీసుకుంటూ బ్రిడ్జిలపై వర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ బ్రిడ్జిపై ‘ఐ లవ్ హైదరాబాద్’ ను ఏర్పాటు చేయగా..తాజాగా కోరంటి బ్రిడ్జి, హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలా, నల్లకుంట, చిక్కడపల్లి బ్రిడ్జిలపై వర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేశారు. కోరంటి బ్రిడ్జిపై వర్టికల్ గార్డెన్లో చార్మినార్, బతుకమ్మ, కమాంట్ కంట్రోల్ సెంటర్, నూతన సచివాలయం డిజైన్లతో కూడిన ప్రత్యేకతలు ఉన్నాయి. అవి అటుగా వెళ్లే వారిని ఆకట్టుకుంటున్నాయి. హెరిటేజ్, కల్చర్, డెవలప్మెంట్ థీమ్తో ఈ గార్డెన్లు కనువిందు చేస్తున్నాయి. ప్రతి వర్టికల్ గార్డెన్ ఆటోమేటెడ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టంతో రోజుకు 100 మిల్లీ లీటర్ల డోస్తో నీరు అందించి ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణంలో ప్రయాణం ఉండేలా చేస్తున్నారు. పిల్లర్లకు అలంకారప్రాయమైన గ్రీన్ వాల్స్ మొక్కలను నాటుతున్నారు.