సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ లక్షణాలతో రోగులు దవాఖానలకు క్యూ కడుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు ప్రధాన కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఓ పక్క కరోనా భయం, మరోపక్క వైరల్ ఇన్ఫెక్షన్స్తో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. కొవిడ్కు సంబంధించి ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన పనిలేదని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు తెలిపారు.
ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల వల్లే…
ఉష్ణోగ్రతల్లో ఏర్పడుతున్న హెచ్చుతగ్గుల కారణంగా సీజనల్ లక్షణాలు ఎదురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఉన్నట్టుండి ఒకేసారి ఉష్ణోగ్రతలు పడిపోయి.. చలి తీవ్రత పెరిగిపోవడంతో వైరల్ ఫ్లూ వ్యాపిస్తున్నట్లు చెబుతున్నారు.. దీని వల్ల చాలా మందిలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయని తెలిపారు. వైరల్ బాధితులు పెరగడంతో దవాఖానల్లో రోగుల తాకిడి పెరుగుతున్నదని, ఇంట్లో ఒకరు వైరల్ బారిన పడితే.. కుటుంబ సభ్యులందరిపై ప్రభావం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వైరల్ ఫీవర్ అనేది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం సాధారణమేనని, దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు స్పష్టం చేశారు. అయితే, నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
శీతాకాలంలో ఇది సాధారణమే
చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ సర్వసాధారణమే. ప్రస్తుతం కరోనా కాలం కావడంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లిన సమయంలో ముఖానికి మాస్క్ ధరించాలి. కరోనా నియమాలు పాటించాలి. జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మూడు రోజులైనా లక్షణాలు తగ్గకపోతే డాక్టర్ సూచన మేరకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైతే కరోనా పరీక్ష సైతం చేయించుకోవాలి.
– డాక్టర్ వెంకటి, హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి