హైదరాబాద్: హైదరాబాద్ నగరంతోపాటు పరిసర జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ నదికి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల నుంచి 6 వేల క్యూసెక్కుల నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వానలతో ఉమ్మడి జలాశయాల గేట్లను అధికారులు ఎత్తివేశారు. హిమాయత్సాగర్ వద్ద సర్వీసురోడ్డుపై నీరు ప్రవహిస్తున్నది.
అదేవిధంగా భారీవర్షాలకు గండిపేట చెరువు ఆరు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో వరద మూసీనదిలోకి వచ్చిచేరుతున్నది. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎగువనుంచి వరద పోటెత్తడంతో చాదర్ఘాట్ వద్ద మూసీ పరవళ్లు తొక్కుతున్నది. చాదర్ఘాట్ దిగువ బ్రిడ్జిని తాకుతూ మూసీ ప్రవహిస్తున్నది. ఇక మూసారంబాగ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్నది.